‘కొందరి మెప్పు కోసం హిందువులను అణచివేస్తున్నారు..!’
రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతుందంటూ మండిపడ్డా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్చందర్.;
కొందరిని మెప్పించడం కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్.. హిందువులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడి వద్ద హిందూ సంఘాలు కుంకుమార్చన నిర్వహిస్తున్నాయి. ఆ కార్యక్రమానికి రామ్చందర్ రావు వెళ్తారేమో అన్న అనుమానంతో పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. ఈ విషయం తెలియడంతో పోలీసుల వైఖరిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల చర్యలు తప్పుబట్టారు. హిందువులు పెద్దమ్మ గుడికి వెళ్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. కక్ష పూరితంగానే రామ్చందర్ రావును హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎవరినో మెప్పించడం కోసం హిందువులను అవమానించడం, వారి మనోభావాలను దెబ్బతీయడం సమంజసం కాదని హితవు పలికారు.
‘‘అయినా పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్య నగర్ లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం’’అని బండి పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ‘‘పాత పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా, శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుతోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయి’’ అని అన్నారు.