తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో ఈ డిమాండ్ మరింత అధికంగా పెరగనుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు తెలిపారు. విద్యుత్శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదికే విద్యుత్ డిమాండ్ సుమారు 9.8శాతం పెరిగిందని చెప్పారు సీఎం. డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నాణ్యమైన విద్యుత్ను అందించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 2025,26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది. 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుంది. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ‘‘వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు సీఎం. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని చెప్పారు.
‘‘గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాల ను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలి. భవిష్యత్తు లో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది. హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి’’ అని ఆదేశించారు.
‘‘ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదు. హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలి. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలి. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి’’ అని సూచించారు.