టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ప్లాన్ ఇదేనా ?

బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిందో అప్పటినుండి లిక్కర్ స్కామ్ ఏమైందో ఎవరికీ తెలీదు;

Update: 2025-06-27 08:59 GMT
Central Ministers G Kishan Reddy and Bandi Sanjay

రోజులు గడిచేకొద్దీ టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో అనేక విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. ఇదేసమయంలో విచారణతీరు జోరుగా సాగటంలేదని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ట్యాపింగ్ విచారణ లాజికల్ ఎండ్ కు చేరుకుంటే బుక్కయ్యేది బీఆర్ఎస్ అగ్రనేతలే అన్న విషయం అందరికీ తెలిసిందే. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) వాస్తవం అని ఇప్పటికే తేలిపోయింది. మావోయిస్టు(Maoists)ల ముద్రవేసి బీఆర్ఎస్ ప్రత్యర్ధుల మొబైల్ ఫోన్లను ట్యాప్ చేశారన్నది వాస్తవం. బీఆర్ఎస్ ప్రత్యర్ధులు అనుకున్న సుమారు 4200 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిన విషయం ఆధారాలతో సహా బయటపడింది. ఇంకా ఎన్నివేల ఫోన్లను ట్యాప్ చేశారన్నది తెలియాల్సుంది. ఇప్పటికే సుమారు 270 మంది బాధితులను సాక్ష్యులుగా సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్) అధికారులు విచారణకు పిలిచి వాగ్మూలాలు తీసుకున్నారు.

ఈసమయంలో బీజేపీ నేతలు ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించాలని కోర్టుల్లో కేసులు వేయటం ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ మాజీ ఎంఎల్ఏ చింతల రామచంద్రారెడ్డి హైకోర్టులోను, రాష్ట్రఉపాధ్యక్షుడు ప్రేమేందర్ రెడ్డి సుప్రింకోర్టులోను కేసులు దాఖలు చేశారు. వీళ్ళు కేసులు వేయటానికి కారణం ఏమిటంటే ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్రప్రభుత్వం లోతుగా విచారించటంలేదట. బీఆర్ఎస్ తో రేవంత్ కుమ్మక్కవ్వటం వల్లే విచారణ సరిగా జరగటంలేదని వీళ్ళు పదేపదే ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ కేసును రాష్ట్రప్రభుత్వం వదిలేసినా తాము మాత్రం వదిలిపెట్టే ప్రశ్నేలేదని కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) పదేపదే చెబుతున్నారు. ట్యాపింగ్ కేసును అర్జంటుగా సీబీఐ(CBI)కి అప్పగించాలని బండి డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించుంటే ఈపాటికే కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), టీ ప్రభాకరరావును గుంజుకుపోయి జైల్లో వేసేవారమని కూడా బండి అన్నారు. వీళ్ళని గుంజుకుపోయి జైల్లో వేయటం బండి చెప్పినంత సులభంకాదని అందరికీ తెలుసు.

గెలుపు మీద భయంతోనే ట్యాపింగ్ అనే అరాచకానికి కేసీఆర్ తెరతీశారన్నది అందరికీ తెలిసిందే. 2018లో రెండోసారి గెలిచింది ప్రజాబలంతో కాదని కేవలం ట్యాపింగ్ వల్లే అనే ఆరోపణలు ఇపుడు బాగా వినబడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ట్యాపింగ్ కేసును సీబీఐకి బదిలీచేయాలని బీజేపీ నేతలు కోర్టుల్లో కేసులు దాఖలు చేయటం కీలకంగా మారింది. అయితే కమలంపార్టీ నేతలు కోర్టుల్లో కేసులు వేయటాన్ని కాంగ్రెస్ నేతలు తప్పపడుతున్నారు.

మంత్రులు, కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో కేసులు, అరెస్టులంటు ఒకపుడు సీబీఐ, ఈడీలు ఎంత హడావుడి చేశాయో అందరికీ తెలిసిందే. ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకునే లక్ష్యంతో అప్పట్లో నరేంద్రమోదీ(Narendra Modi), అమిత్ షా(Amit Shah) పావులు కదిపారు. ఇందులో భాగంగానే చాలామంది ఆప్(AAP) ప్రభుత్వంలోని ఎంఎల్ఏలు, మంత్రులపై కేసులు పెట్టి జైళ్ళల్లోకి తోశారు. చివరకు అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈకేసులోనే కల్వకుంట్ల కవిత కూడా అరెస్టయి జైలులో ఆరుమాసాలు గడిపింది. చివరకు ఎన్నికల్లో టార్గెట్ రీచయిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిందో అప్పటినుండి లిక్కర్ స్కామ్ ఏమైందో ఎవరికీ తెలీదు. అప్పటినుండి కేసులు లేవు, దర్యాప్తులు లేవు, కోర్టులో విచారణలు కూడా జరగటంలేదు.

ఈవిషయాలనే మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఎత్తిచూపుతున్నారు. ట్యాపింగ్ కేసును సీబీఐకి బదిలీచేయించుకోవటం ద్వారా కేసీఆర్, కేటీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది తప్ప కేసులు పెట్టి జైళ్ళకు పంపే ఆలోచన బీజేపీలో లేదని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కేసీఆర్, కేటీఆర్ ను తప్పించటమే బీజేపీ ఏకైక లక్ష్యంగా మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఆరోపిస్తున్నారు. మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏల ఆరోపణలు, లాజిక్కులో వాస్తవం ఉందేమో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News