మంత్రి అజహర్ కు శాఖల కేటాయింపు
ఆరోజు నుండి సోమవారం వరకు అజహర్ శాఖలు లేని మంత్రిగానే ఉన్నారు
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఐదురోజులకు మొహమ్మద్ అజహరుద్దీన్ కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శాఖలను మంగళవారం కేటాయించారు. పోయిన నెల 31వ తేదీన అజహర్(Mohammed Azharuddin) రాజ్ భవన్ లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆరోజు నుండి సోమవారం వరకు అజహర్ శాఖలు లేని మంత్రిగానే ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా శాఖలు లేని మంత్రిగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం ఉదయం అజహర్ కు రేవంత్(Revanth) రెండు శాఖలను కేటాయించారు. తాను చూస్తున్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖతో పాటు సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) దగ్గరున్న మైనారిటీల సంక్షేమ శాఖను రెండింటిని అజహర్ కు కేటాయించారు.
పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మైనారిటి శాఖలను మంత్రి అజహర్ కు కేటాయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీచేశారు. మామూలుగా ఇన్నిరోజులు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపు లేకుండా ఉండరు. కాని అజహర్ కు మాత్రం ప్రమాణస్వీకారం చేసిన ఆరురోజుల తర్వాత శాఖలను కేటాయించారు. మైనారిటి శాఖతో పాటు రేవంత్ దగ్గరే ఉన్న హోంమంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని అజహర్ పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది. హోంశాఖ కోసం అధిష్ఠానం ద్వారా రేవంత్ పై అజహర్ పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం అయ్యింది.
అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మైనారిటి శాఖలను అజహర్ నిర్వహిస్తారని తేలిపోయింది. మరి శాఖల కోసం అజహర్ పట్టుబట్టాడని జరిగిన ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అన్నది తెలీదు.