నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదలు;
ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలు నాగార్జునసాగర్ జలాశయంలో చేరుతున్నాయి. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి వేసారు. ఎగువ నుంచి జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 2,04,048 క్యూసెక్కుల నీటిని ఇప్పటికే విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590.00 (312.04 టీఎంసీలకు) అడుగులు ఉండగా ప్రస్తుతం 586.60 అడుగులకు చేరింది.
తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో ఉన్న ఈ జలాశయం అతి పెద్ద జలాశయాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై పై నిర్మించిన జలాశయం ఇది. దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యత వల్ల ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని నామకరణం చేశారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం గా పేరు గాంచింది. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ఎగ్జిబిషన్ లో భద్ర పరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి.