మేడ్చల్ జిల్లాలో కొత్త రాతి చిత్రాల తావు గుర్తింపు

ఈ చిత్రాలలో ఒక యుద్ధరంగదృశ్యాలు ఉన్నాయి.;

Update: 2025-08-16 04:37 GMT

భారతదేశంలో వందలాది రాతిచిత్రాల తావులున్నాయి. వాటిలో మధ్యప్రదేశ్ లోని యునెస్కో గుర్తింపు పొందిన బింభేట్కా చిత్రిత శిలాశ్రయం ప్రసిద్ధమైంది. తెలంగాణాలో పాండవులగుట్ట దానంతటి రాతిచిత్రాలతో విశిష్టమైంది. తెలంగాణాలో నేటివరకు అన్వేషింపబడిన రాతిచిత్రాల తావులసంఖ్య 85. వీటిలో 46 రాతిచిత్రాలతావులను గుర్తించింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం. చరిత్రబృందం రాతిచిత్రాల పరిశోధకులు అహోబిలం కరుణాకర్, ఎండి.నసీరుద్దీన్ సంయుక్తంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని యాద్గారపల్లిలో, 17.401043 ఉత్తర అక్షాంశాలు, 80.815642 తూర్పురేఖాంశాల మీద కొత్త రాతిచిత్రాలతావును గుర్తించారు. ఊరిబయట పరుపురాతిబండఉన్న రాతిగుండ్లతో ఏర్పడ్డ గుహలో ఈ రాతిచిత్రాలతావున్నది. గతంలో ఈ ప్రాంతంలోనే కాశీపేట, ప్యారారం, లింగన్నపేట, ముచ్చింతల ప్రాంతాలలో కొత్త చిత్రాలతావులను ఈ చరిత్రబృందమే అన్వేషించిందని చరిత్రకారుడు శ్రీరామోజు  హరగోపాల్ తెలిపారు.




ఈ రాతిచిత్రాలతావులో రాతిచిత్రాలు ఎరుపు, తెలుపు రంగులలో చిత్రించబడ్డాయి. ఈ చిత్రాలలో ఒక యుద్ధరంగదృశ్యాలు పెద్దరాతికాన్వాస్ మీద ఎరుపురంగులో ఒక చిత్రం తెలుపురంగులో గీయబడ్డాయి. రాతిచిత్రాలు మంచికుంచెలతో తాజా ఎరుపు, తెలుపురంగుల్లో వేసినట్లున్నాయి. యుద్ధంలో పాల్గొన్న వీరులు విల్లమ్ములు, కత్తులు ధరించి పోరాడుతున్నారు. తలపడుతున్న యోధులు, నిర్జితులైన వీరులు ఈ యుద్ధదృశ్యంలో అగుపిస్తున్నారు. ఏనుగు, పులి, గుర్రాలవంటి జంతువులు కూడా చిత్రించబడ్డాయని ఆయన చెప్పారు.

చిత్రిత శిలాశ్రయ పరిశోధకులు అహోబిలం కరుణాకర్,  ఎండి నసీరుద్దీన్ 


ఈ రాతిచిత్రాలలో ఎక్కువమట్టుకు పుల్లగీతలబొమ్మలెక్కువగా కనిపిస్తున్నాయి. ఒకచోట చేతులుపట్టుకుని, మరొకచోట ఆయుధాలు చేతపట్టి సామూహికనృత్యం చేస్తున్న మనుష్యులు, ఎద్దువంటి జంతువు, చేతిగుర్తులు, గుర్రంవంటి జంతువునెక్కిన మనిషి, ఒకదగ్గర తాబేలువంటి జలచరం, ఎరుపురంగు రాతిచిత్రాల నడుమ తెలుపురంగులో గుర్రం మీద స్వారీచేస్తున్న వీరుడు ప్రధానంగా కనిపిస్తున్నాడు. మరికొన్ని తెలుపురంగుబొమ్మలు ఫేడ్ అయిపోయాయి. తెలుపురంగుబొమ్మల మీదనే ఎరుపురంగుబొమ్మలు వేయబడ్డంవల్ల ఆ బొమ్మలు స్పష్టంగా అగుపించడం లేదు. తెలుపురంగు చిత్రాలలో జంతువులు, వేటాడిన జంతువులు మోసుకునిపోతున్న 4గురు వ్యక్తులు ఒక తావున కనిపిస్తున్నారు.




ఈ రాతిచిత్రాలతావులోని చిత్రాలలోని ఎరుపు, తెలుపు వర్ణాలు, చిత్రాల శైలి, వస్తుపరంగా విశ్లేషించినపుడు, ఇక్కడ సూక్ష్మరాతి(మైక్రోలిథిక్) పనిముట్ల లభ్యత కారణంగా, కొత్తరాతియుగం నూరుడుగుంటల ఆధారంగా, ఈ తావు పురామానవుల ఆవాసమని, మధ్యరాతియుగం నుంచి చారిత్రకయుగం వరకు చిత్రించబడ్డ చిత్రిత శిలాశ్రయమని పేర్కొనవచ్చని ఆయన చెప్పారు.



Tags:    

Similar News