మందగించిన నైరుతి రుతుపవనాలు, తెలంగాణలో పొడి వాతావరణ పరిస్థితులు

నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు వ్యాపించడంతో తెలంగాణలో గాలిలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడింది.;

Update: 2025-06-05 10:13 GMT
నైరుతి రుతుపవనాల వర్షాల కోసం రైతన్న ఎదురుచూపులు

నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు వ్యాపించడంతో దక్షిణాది రాష్ట్రాల పరిధిలోని తెలంగాణలో గాలిలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడిందని భారతీయ వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ముందుగా ప్రవేశించి మే నెలలో వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్న తరుణంలో రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు పయనించడంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి.


మందగించిన రుతుపవనాలు
తెలంగాణరాష్ట్రంలో రుతుపవనాలు కొంచెం మందగించాయి.మే నెల చివరిలో కురిసిన భారీవర్షాల వల్ల వేడి నుంచి కొంత ఉపవమనం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా వర్షపాతం లేకపోవడం వల్ల తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. మే చివరి వారంలో హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాల తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35–36 డిగ్రీల సెల్షియస్ కు తగ్గాయి.ప్రస్థుతం పొడివాతావరణం ఏర్పడటం వల్ల క్రమంగా పెరుగుతున్నాయి.గురువారం నల్లొండ జిల్లాలో అత్యధికంగా 38 డిగ్రీల సెల్షియస్, ఆదిలాబాద్ జిల్లాలో 37.8 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాగల నాలుగురోజుల పాటు చెదురుమదురు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాగల నాలుగు రోజుల పాటు చెదురుమదురు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.

జూన్ 10 తర్వాత చురుకుగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వైపు వ్యాపించడంతో తెలంగాణలో గాలిలో తేమ శాతం తగ్గి పొడి వాతావరణం ఏర్పడింది. దీంతో జూన్ 10వతేదీ తర్వాత నైరుతి రుతుపవనాల ప్రభావం పెరిగి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్త ఏ ధర్మరాజు చెప్పారు. మళ్లీ భారీవర్షాలు కురిసిన తర్వాతే రైతులు విత్తనాలు విత్తాలని ఆయన సూచించారు. పొడి వాతావరణంతోపాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడినందున ఖరీఫ్ పంటల సాగుకు వారం రోజుల పాటు వేచి ఉండాలని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

రైతులు వేచి ఉండాలి
తెలంగాణ రైతులు ఈ ఖరీఫ్ సీజనులో పంటలు విత్తే ముందు వేచి ఉండాలని తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. 20సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తడం ప్రారంభించాలని వ్యవసాయ శాఖ అధికారులు సిఫార్సు చేశారు. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వచ్చినా ప్రస్థుతం పొడి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో రైతులకు ఈ సూచన చేశారు. ఈ ఏడాది ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు చురుకుగా సాగక పోవడంతో పొడి వాతావరణం ఏర్పడింది.


Tags:    

Similar News