TGRTC | మానవతావాదులు ఈ ఆర్టీసీ ఉద్యోగులు, ఏం చేశారంటే...

ఆర్టీసీ బస్సులోనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు.బస్సు స్టేషనులో ఉన్న ఓ మహిళకు గుండెపోటు రావడంతో అక్కడ ఉన్న డీఎం సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.;

Update: 2025-02-05 14:59 GMT

ఆపదల్లో ఉన్న ప్రయాణికులకు సహాయం చేసి మానవత్వం చాటిన ఆర్టీసీ సిబ్బందికి బుధవారం సన్మానించారు. విధి నిర్వహణలో మానవత్వం చాటుకున్న తమ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ఘనంగా సన్మానించింది.హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం ఉన్నతాధికారులతో కలిసి మణుగూరు డిపో డ్రైవర్ కోటేశ్వరరావు గద్వాల్ డిపో కండక్టర్ కిషోర్ కుమార్, డ్రైవర్ నరేందర్ గౌడ్, జగిత్యాల డిపో మేనేజర్ సునీతలను సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సత్కరించారు.


డ్రైవర్‌ చాకచక్యం.
మణుగూరు డిపోకు చెందిన బస్సులో గత ఏడాది డిసెంబర్‌ 21వతేదీన ప్రయాణికురాలి 10 తులాల బంగారు అభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ విషయాన్ని ఆమె విలపిస్తూ పీహెచ్‌బీ డ్రైవర్‌ కోటేశ్వరరావు కు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును భద్రాచలం బస్ స్టేషన్ లో ఆపి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఒక ప్రయాణికురాలు వేగంగా వెళుతున్న విషయాన్ని డ్రైవర్ గమనించి ఆమెను అనుసరించారు.బంగారు అభరణాలున్న బ్యాగ్ వేరే ప్రాంతంలో పెడుతుండగా గుర్తించారు. అభరణాలను అపహరించిన మహిళను పోలీసులకు అప్పగించారు. పోలీసుల సహకారంతో 10 తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికురాలికి ఇప్పించారు.

బస్సులో ప్రసవం.. ఆర్టీసీ సిబ్బంది ఉదారత
గద్వాల డిపోనకు చెందిన బస్సులో జనవరి 2న రాయచూర్ నుంచి గద్వాలకు ప్రయాణిస్తుండగా ఒక గర్భిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్‌ కిషోర్‌ కుమార్‌.. డ్రైవర్‌ నరేందర్‌ గౌడ్‌ కు సమాచారం ఇచ్చారు. వెంటనే బస్సును పక్కకు ఆపి.. వారు 108 కి సమాచారం ఇచ్చారు. అంతలోనే పురిటినొప్పులు ఎక్కువ కావడంతో తోటి ప్రయాణికురాళ్లను సహకరించాలని కోరారు. వారు పురుడు పోయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం తల్లి బిడ్డను ఆస్పత్రిలో చేర్చించారు.

ప్రయాణికురాలికి గుండెపోటు..డీఎం సీపీఆర్‌
జగిత్యాల బస్‌ స్టేషన్‌ లో జనవరి 12న ఒక ప్రయాణికురాలికి గుండెపోటు వచ్చింది. సంక్రాంతి ఆపరేషన్స్‌ లో భాగంగా అక్కడే విధులు నిర్వహిస్తోన్న జగిత్యాల డీఎం సునీత.. వెంటనే అప్రమత్తమయ్యారు. సత్వరమే స్పందించి ఆమెకు సీపీఆర్‌ చేశారు. అనంతరం 108 సాయంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. డీఎం సకాలంలో సత్వరమే స్పందించడంతో ప్రయాణికురాలికి ప్రాణాప్రాయం తప్పింది.సమయస్పూర్తితో వ్యవహారించి ఉదారతను చాటుకున్న సిబ్బందిని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ అభినందించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమని ఆయన కొనియాడారు.గద్వాల డిపో బస్సులో జన్మించిన ఆడపిల్లకు లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను యాజమాన్యం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.




Tags:    

Similar News