HCU లోని 400 ఎకరాలు అటవీ భూమి.. బండి సంజయ్
అడవులు నరికి భూములు అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని బండి విమర్శించారు.;
హైదరాబాద్ సెంట్రల్ యూనిర్శిటీ(HCU) భూముల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆ భూములు వర్సిటీవా, ప్రభుత్వానివా అన్న అంశంపై చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించడానికి బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసుటు వారిని వారివారి నివాసాల దగ్గరే అడ్డుకున్నారు. హెచ్సీయూ సందర్శనకు అనుమతి లేదంటూ ముందస్తు అరెస్ట్లు చేశారు. కాగా తాజాగా కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చదును చేస్తున్న భూమి హెచ్సీయూది కాదని, అలాగని సర్కార్ది కూడా కాదన్నారు. ఆ 400 ఎకరాల భూమి అటవీ భూమి అని పేర్కొన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని గుర్తు చేశారు.
‘‘కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే NGO దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు’’ అని బండి సతెలిపారు.