యూనివర్శిటీల భూములు కాజేయాలనుకుకోవడమేమిటి?

విశ్వవిద్యాలయాల భూముల పరిరక్షణ బాధ్యత విస్మరిస్తున్న ప్రభుత్వాలు;

Update: 2025-03-31 23:09 GMT

-రమణాచారి


ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే కంచే చేను మేసిన చందంగా మారింది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు "మా భూములు, మానీళ్లు మా ఉద్యోగాలు, మా నిధులు మావే".ఈ ఉద్యమాలకు ఊపిరిలూదింది విద్యార్థులే.

కేవలం తెలంగాణకే పరిమితం కాదు, యావత్ భారతదేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలన్నింటికి తోడుగా నిలిచింది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే. ప్రశ్నించే గొంతుకలను నిలువరించేందుకే పాలక ప్రభుత్వాలు విద్యా సంస్థల, యూనివర్సిటీలను ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడం. అందులో భాగంగానే యూనివర్సిటీ భూముల అమ్మకాలు/ పరాయీకరణ. తాజాగా హైదరాబాదులోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (H.C.U ) కు చెందిన 400 ఎకరాల భూమిని TGIIC కి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది.

దీనిని నిరసిస్తూ ఉద్యమించిన విద్యార్థిని, విద్యార్థులపై దాడి చేయడం, అక్రమంగా నిర్భందించడం నిత్యకృత్యమైంది. కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల నిరసనకు, ఉస్మానియా గొంతు కలిపింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ సాక్షిగా ఇది విశ్వవిద్యాలయం భూమి కాదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించగా, పర్యావరణం దెబ్బతింటుందన్నది అబద్ధమని గుంటనక్కలే ఉండి గోల చేస్తున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇది మరింత హాస్యాస్పదం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు మాట్లాడే,  కనీస ప్రజాస్వామిక హక్కులు ( ప్రభుత్వ ఏడవ హామీ ) రక్షించబడతాయని భావించిన ఉద్యమకారుల కల పగటికలే అయింది.

‘జై తెలంగాణ’ ఉద్యమం 1969 నుండి ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఆరు సూత్రాల పథకంలో భాగంగా, ఉపశమనం కోసం 1974లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలి లో 2300 ఎకరాల భూమిని ( సర్వే నెంబర్ 25 ) కేటాయించి పరిశోధనలకు, విద్యా బోధనకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ గా ఖ్యాతి గడించి, ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలను అందించిన విశ్వవిద్యాలయంగా పేరుగాంచి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్లో 100 వ స్థానాన్ని, భారత్ అక్రిడిటేషన్లో 10 వ స్థానాన్ని పొందింది.

హెచ్ సియు  అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వ బుల్ డోజర్లు చదును చేస్తుండటంతో బిక్కు బిక్కుముంటున్న జింకలు


ఈ విశ్వ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని కేవలం విద్యారంగ అభివృద్ధికి, పురోగతికి, పరిశోధనలకు మాత్రమే వినియోగించాలని ఇతరములకు కేటాయించరాదని నాటి ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నది. ఇంత స్పష్టంగా ఆదేశాలిచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జవహర్ నవోదయ స్కూల్ కు, ఏపీఎస్ఆర్టీసీ కి, స్పోర్ట్స్ అథారిటీకి, రంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ కు, మండల రెవెన్యూ ఆఫీసుకు, స్టాటిస్టికల్ సెర్చ్ కు, ఏపీ ఎన్జీవోస్ కి అంటూ పలు విభాగాలకు 2004 వరకే 680 ఎకరాల భూమిని కేటాయింపులు చేశారు.

ఇప్పుడు TGIIC కి ఇచ్చిన 400 ఎకరాల భూమిని, వివిధ ప్రైవేట్ కంపెనీలకు కేటాయించారు. ఈ భూమి మొత్తంగా యూనివర్సిటీ కాంపౌండ్ లోనే ఉంది. దీనిని ప్రభుత్వ భూమి అనడం/ ప్రకటించడం ఏ మేరకు సమంజసం?
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, విశ్వవిద్యాలయాల, విద్యాలయాల భూములను అన్యాక్రాంతం చేయడం ఆనవాయితీగా వస్తోంది. పర్యావరణాన్ని దెబ్బతీయడమే కాకుండా, నగరాలకు ఆక్సిజన్ అందించే వృక్షాలను ధ్వంసం చేయడం, వీటితో మనుగడ సాగిస్తున్న పశుపక్ష్యాదులను అంతమొందించడం, జాతి నిర్మాణానికి ఉపయోగపడే, పరిశోధనలకు అవకాశం లేకుండా చేయడం విధ్వంసక చర్య. కేవలం కాంక్రీట్ బిల్డింగులకు పరిమితం చేయడం అంటే విద్యారంగాన్ని శాస్త్రీయత లేని యాంత్రీకరణ చేయడమే కాగలదు. విధ్వంసం ఎప్పటికీ అభివృద్ధి కాజాలదు.
చారిత్రాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి 2400 ఎకరాల భూమిని కేటాయించగా ఇప్పుడు అది 1600 ఎకరాలకు పరిమితమైంది. కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 640 ఎకరాల భూమిలో స్థాపించగా అనేక అక్రమాలకు గురైంది. ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీలోని 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించారు. ప్రపంచ దేశాలలో యూనివర్సిటీలను ముందుచూపుతో (200 లేక 300 సంవత్సరాలు) భూములు కేటాయించి కాపాడుతుండగా తెలంగాణలో, దేశంలో మాత్రం తాత్కాలికంగా ఆలోచిస్తూ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు.
విద్యాలయాలు ఆధునిక దేవాలయాలు. దేశం పలు రంగాల్లో అభివృద్ధి సాధించడానికి ఇవి దోహదకారులు. భావి తరాలలో చైతన్యాన్ని, శాస్త్రీయ అవగాహనను పెంపొందించడానికి సుక్షితులైన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులతో, అరకొర వసతులతో అల్లాడుతున్న విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం ఆపేసి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు భారీగా అనుమతులు మంజూరు చేస్తున్నారు.వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వందలాదిమంది బోధన, బోధ నేతర సిబ్బంది మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు.
పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలను కనిపించకుండా వినిపించకుండా, కుందేళ్లు దుప్పులు, అడవి పందుల పరుగులు వినపడకుండా, జలాశయాల ఉనికి లేకుండా చేస్తున్నారు. బఫె ల్లో లేక్, పీకాక్ లేకులు లేవంటున్నారు. అసది అటవీ భూమి కాదని వాదిస్తున్నారు. బయో లైఫ్ ను రూపం లేకుండా చెరిపి వేస్తున్నారు. పురాతన చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన మాఘ్రమ్ రాక్స్ ప్రాంతాన్ని కార్పొరేటీకరణకు ధారాదత్తం చేస్తున్నారు.
విద్యార్థుల నిరసనను పక్కదారి పట్టిస్తూ, మద్దతుగా నిలిచిన బుద్ధి జీవులు మేధావులపై రెచ్చగొడుతున్నారనే అపవాదు మోపుతున్నారు. ప్రశ్నించడం అంటే ప్రజల కోసం, సత్యం కోసం, ప్రగతిశీల అభివృద్ధి కోసం నిలబడటమే. రెండున్నర దశాబ్ధాల పాటు బోధన చేయడంతో ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్న, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ వంటి పెద్దల అభిప్రాయాన్ని గౌరవించైనా కాంగ్రెస్ ప్రభుత్వం HCU భూముల కేటాయింపు ప్రక్రియను/ ఆలోచనను తక్షణం ఉపసంహరించుకోవాలి. ఈ విషయంలో విజ్ఞతతో నిర్ణయం తీసుకోవడం పాలకుల బాధ్యత. ఈ ప్రత్యేక సందర్భంలో ఆపార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణా ఆత్మ గౌరవ రక్షణ కోసం చొరవ చూపడం ఎంతైనాఅవసరం.అనివార్యం కూడా!


Tags:    

Similar News