కేసీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించి ఉంటారు ?
ఇన్ని వేలఫోన్లను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ ఆ సమాచారంతో ఏమిచేశారు ?;
గడచిన రెండు వారాలుగా స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్(సిట్) అధికారులు చేస్తున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో విస్తుపోయే ఎన్నో అంశాలు బయటపడుతున్నాయి. గతంలో అందరు అనుకున్నట్లుగా ట్యాపయిన ఫోన్లు 4200 కాదు ఏకంగ 40 వేల ఫోన్లు అన్న విషయం ఇపుడు వెలుగుచూసింది. ఇన్ని వేలఫోన్లను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్ ఆ సమాచారంతో ఏమిచేశారు ? అసలు అన్నివేలమంది ఫోన్లను ట్యాపింగ్ చేయించిన తర్వాత ఆ సంభాషణలు వినటం సాధ్యమేనా ? అన్న సందేహాలు పెరిగిపోతున్నాయి. బయటపడుతున్న సమాచారం, వివరాలు చూసిన తర్వాత నీటిలో ఉండటమే మొసలికి బలం అన్నట్లుగా ట్యాపింగే కేసీఆర్ బలమా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.
సరే, ఎన్నివేల ఫోన్లు ట్యాపింగ్ చేయించినా ఏమిటి ఉపయోగం ? జనబలం ముందు ట్యాపింగ్ లు, ట్యాంపరింగులు ఏమీ నిలబడవన్న విషయం కేసీఆర్(KCR) కు అప్పట్లో తెలీలేదేమో. ట్యాపింగ్(Telephone Tapping) చేయించారు సరే అసలు అన్ని వేలఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేయించారు అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. ట్యాపింగ్ చేయించటానికి మూడు కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే తన పాలనపై జనాలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారన్న విషయం అర్ధమైపోవటం. రెండో కారణం ఓటమి తప్పదనే భయం పెరిగిపోవటం. జనబలంతో కాకుండా ప్రత్యర్ధులను బలహీనులుగా చేసి ఏదో పద్దతిలో గెలిచాము అనిపించుకోవటమే అయ్యుంటుంది.
2014 ఎన్నికల్లో గెలిచిందే అత్తెసరు మెజారిటితో. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించానని కేసీఆర్ ఎన్నిచెప్పుకున్నా జనాలు పట్టించుకోలేదు. అందుకనే 119 సీట్ల అసెంబ్లీలో 110 సీట్లకు పోటీచేస్తే బీఆర్ఎస్(BRS) కు వచ్చింది 63 సీట్లు మాత్రమే. అంటే సుమారు 50 శాతం సీట్లు మాత్రమే తెలంగాణ జాతిపిత పార్టీ గెలుచుకున్నది. ఏ కారణం వల్లయినా ఓ ఐదుమంది ఎంఎల్ఏలు పార్టీ మారితే ప్రభుత్వం కూలిపోతుందన్నమాట. తనకు వచ్చిన సీట్లను చూసి కేసీఆర్ భయపడుంటారు. ఏరోజైనా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనతోనే యధేచ్చగా టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రలోభాలకు గురిచేయాలంటే ముందుగా వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకోవాలి. నేరుగా పిలిచి అడిగితే ఎవరైనా చెబుతారా ? అందుకనే ఎవరికీ అనుమానాలు రాకుండా ట్యాపింగ్ కు తెరలేపారు. దాంతో చాలామంది ఎంఎల్ఏలను లాగేసుకున్నారు.
2018 ఎన్నికల సమయానికి పాలనా అనుభవం రావటంతో ముందుజగ్రత్త పడినట్లున్నారు. అందుకనే 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాకుండా కమ్ ఫర్టబుల్ సీట్లు రావాలని అనుకున్నారు. అందుకనే టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులు, నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించారంటేనే కేసీఆర్ లో భయం ఎంతగా పెరిగిపోయిందో అర్ధమవుతోంది. రెండో ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 సీట్లలో పోటీచేసి 88 సీట్లలో గెలిచింది. మొదటి ఎన్నికలో కన్నా రెండో ఎన్నికలో ఎక్కువ సీట్లు గెలిచిందంటే కేసీఆర్ పాలన మెచ్చిన జనాలు ఎక్కువ సీట్లిచ్చారని అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే ఇపుడు బయటపడుతున్న విషయాలను గమనిస్తే ట్యాపింగ్ చేయించటం వల్లే కేసీఆర్ రెండో ఎన్నికల్లో గెలిచినట్లు అనుకోవాల్సొస్తోంది.
ప్రత్యర్ధిపార్టీల ఫోన్లు, అభ్యర్ధులు, సీనియర్ నేతల ఫోన్లు, మద్దతుదారుల ఫోన్లను ట్యాపింగ్ చేయించి ముందుగానే వ్యూహాలు తెలుసుకుని దానికి ప్రతి వ్యూహాలు రచించారు. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధు ఆర్ధిక వనరులను స్తంబింపచేశారు. ముఖ్యనేతలు, మద్దతుదారులను ప్రచారం చేయనీయకుండా అరెస్టులు చేయించారు. ఎన్నికల ప్రచార వ్యూహాలను తెలుసుకుని దానికి విరుగుడుగా తన పార్టీ అభ్యర్ధులతో పై ఎత్తులతో ప్రచారం చేయించారు. ఎక్కడికక్కడ ప్రత్యర్ధులను కట్టడిచేసి 88 సీట్లలో గెలిచారు. సిట్ విచారణను ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 2018లోనే ఫోన్ ట్యపింగ్ మొదలైన విషయం వెలుగుచూసింది. అంటే సొంతబలంతో కాకుండా ట్యాపింగ్ బలంతోనే బీఆర్ఎస్ రెండోసారి గెలిచినట్లు ఇపుడు అర్ధమవుతోంది. ట్యాపింగ్ బలమే లేకపోతే రెండోసారి 2018 ఎన్నికలోనే బీఆర్ఎస్ ఓడిపోయుండేదేమో.
ఇక, మూడోసారి 2023 ఎన్నికలు వచ్చేసరికి చాలామందికి అనుమానాలు మొదలైపోయాయి. తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని రేవంత్ రెడ్డి(Revanth), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy)తో పాటు అనేకమంది కాంగ్రెస్(Telangana Congress) నేతలు ఆరోపణలు చేశారు. వీళ్ళకు ఎలాగ అనుమానాలు వచ్చాయంటే తాము తమసన్నిహితులతో మాట్లాడుకున్నవన్నీ బీఆర్ఎస్ నేతల్లో కొందరు బయటపెట్టడం మొదలుపెట్టారు. 2018 ఎన్నికల తర్వాత జరిగిన కొన్ని ఉపఎన్నికల్లో తమ వ్యూహాలకు బీఆర్ఎస్ ఎదురు వ్యూహాలు పన్నటంతోనే అనుమానాలు మొదలైపోయాయి. నిధుల పంపిణీ విషయాలు పోలీసులకు ముందుగానే తెలిసిపోతుండటంతో కాంగ్రెస్ నేతలకు ట్యాపింగ్ అనుమానాలు బలపడ్డాయి. దానికి తగ్గట్లే హస్తంపార్టీ నేతలు జాగ్రత్తలు పడ్డారు. దానికి తోడు కేసీఆర్ కు ట్యాపింగ్ బలం అక్కరకు రాలేదు. అందుకనే ఎన్ని వేలఫోన్లను ట్యాపింగ్ చేయించినా బీఆర్ఎస్ ఓడకతప్పలేదు.