కోస్తాంధ్రను వణికిస్తున్న మిగ్‌జాం తుపాన్‌

మిగ్‌జాం.. కోస్తాంధ్రను వణికిస్తోంది.

Byline :  Amaraiah Akula
Update: 2023-12-04 17:08 GMT
నెల్లూరు జిల్లాలో తుపాన్‌ బీభత్సం

మిగ్‌జాం.. కోస్తాంధ్రను వణికిస్తోంది. సుమారు 9 జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. అంతకంతకూ వాన పెరుగుతోంది. చేలు నీట మునుగుతున్నాయి. రైతుల గుండెలు దడదడలాడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ధాన్యం తడిసిముద్దయింది. గోదావరి జిల్లాల్లో వరి పంట నీట మునుగుతోంది. జాలర్లను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. నిజాంపట్నం వద్ద పదో నెంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరో 24 గంటలు ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోపక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మెరుపు వేగంతో కదలాని ఆదేశించారు.

తీవ్ర తుపానుగా మిగ్‌జాం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం–బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో ‘మిగ్‌జాం’ తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటేంత వరకూ కోస్తాంధ్ర తీరప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ‘మిగ్‌జాం’ కదలనుంది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది.
బందరుకి వంద కిలోమీటర్ల దూరంలో
ప్రస్తుతం చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ., మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో ‘మిగ్‌జాం’ కేంద్రీకతమైంది. నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటిన తర్వాత తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన అనంతరం తెనాలి, విజయవాడ మీదుగా కదలనుంది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావటంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుపాను విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది.
తీరప్రాంతాల్లో అలజడి
ఇప్పటికే తిరుపతి, నెల్లూరు తీరప్రాంతాల్లో తీవ్రస్థాయిలో అలజడి నెలకొని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కష్ణా జిల్లాల్లోని సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, మచిలీపట్నం, అవనిగడ్డ, రేపల్లె మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.
తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం
తీవ్ర తుపాను మిగ్‌జాం ప్రభావంతో గడచిన 24 గంటల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. తిరుపతి పూలతోట వద్ద 30 సెం.మీ., తిరుపతి జిల్లా అల్లంపాడు వద్ద 26 సెం.మీ., నెల్లూరులో 25.4 సెం.మీ వర్షపాతం, నాయుడు పేటలో 24 సెం.మీ, నెల్లూరు గాంధీనగర్‌లో 22 సెం.మీ., కట్టువపల్లెలో 21 సెం.మీ., వెంకటాచలంలో 19.7 సెం.మీ., చిట్టేడులో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


Tags:    

Similar News