గోవా నైట్క్లబ్ అప్డేట్ : థాయిలాండ్లో ప్రధాన నిందితుల అరెస్టు
థాయిలాండ్కు వెళ్లి గోవాకు తీసుకెళ్లనున్న పోలీసులు..
గోవా(Goa) నైట్క్లబ్ అగ్నిప్రమాద కేసు(Fire Accident)లో క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రాలను థాయిలాండ్లోని ఫుకెట్లో అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ క్లబ్లో డిసెంబర్ 6వ తేదీ అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దుర్ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత లూత్రా సోదరులు ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో థాయిలాండ్కు వెళ్లిపోయారు. డిసెంబర్ 7న తెల్లవారుజామున 1.17 గంటలకు వీరు టిక్కెట్లు బుక్ చేసుకుని, ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ నుంచి పుకెట్కు ఇండిగో విమానం 6E 1073 ఎక్కారని ఇమ్మిగ్రేషన్ అధికారులు పేర్కొన్నారు. కాగా గోవా పోలీసులు త్వరలోనే థాయిలాండ్కు వెళ్లి ఇద్దరినీ అదుపులోకి తీసుకురానున్నారు.
ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ కోర్టు..
థాయ్లాండ్ నుంచి వచ్చిన వెంటనే తమను అరెస్టు చేయకుండా చట్టపర రక్షణ కల్పించాలని లూత్రా సోదరులు ఢిల్లీ రోహిణి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరో రెస్టారెంట్ ఏర్పాటు చేసే పని మీద ఇద్దరూ తమ షెడ్యూల్ ప్రకారమే థాయ్లాండ్లో వెళ్లాల్సి వచ్చిందని వారి తరుపు లాయర్ కోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు.
ఇటు గోవాలో లూత్రా సోదరుల అనధికార క్లబ్లను కూల్చేయనున్నారు. అగ్నిమాపక శాఖ అనుమతులు లేవన్న కారణంతో వాటిని నేలమట్టం చేయనున్నారు. ఈ వారం ప్రారంభంలో బీచ్లోని ఒక గుడిసెను బుల్డోజర్తో కూల్చివేసారు.
గోవాకు మరో యజమాని అరెస్టు..
నైట్క్లబ్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న అజయ్ గుప్తాను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం గుప్తాను ఢిల్లీలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వినోద్ జోషి ముందు హాజరుపరిచారు. ఆయనను ట్రాన్సిట్ రిమాండ్పై ఢిల్లీ నుంచి గోవాకు తీసుకువచ్చారు. తదుపరి విచారణ కోసం అతన్ని అంజునా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు ఒక అధికారి తెలిపారు.