తెలుగు వారల మతులకు తేజ మెచ్చే అమ్మ మా కృష్ణమ్మ!
విజయవాడకు ఓ వరం కృష్ణా తీరం..
By : Pedapolu Ravi
Update: 2025-11-15 06:53 GMT
"తెలుగునేల పొలాలకు జలము లొసగి
తెలుగు వారల మతులకు తేజ మెచ్చి
తెలుగుదేశమ్ము కీర్తికి వెలుగు కూర్పు
కృష్ణవేణీనదీ! నమస్కృతులు గొనుము" అంటారు కవి దివాకర్ల వెంకటావధాని.
విజయవాడకు ఓ వరం కృష్ణా తీరం. తొలిసంధ్య వేళ నది నీళ్లపై వాలే వెలుగు రేఖలు జీవన సౌందర్యాన్ని చాటుతాయి. ప్రకృతిని పరవశింపజేస్తాయి.
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు పారే నీళ్లు మానవ జీవితానికి అద్దం పడతాయి.
ప్రవహించే కృష్ణా ఆగని శ్వాస.
ప్రకృతి, నాగరికత మధ్య నిలిచిన ఈ నగరానికి ఈ నది ఒక అమ్మలాంటిది. ఆదరిస్తుంది, అక్కున చేర్చుకుంటుంది. కోపం వస్తే ఈడ్చికొడుతుంది.. అంతలోనే మళ్లీ జీవితాన్ని ఇస్తుంది.
నీటి ఒరవడి, పక్షుల పిలుపు, గాలి రుచి, నగర మేల్కొలుపు- వీటన్నింటి కలయికే మన కృష్ణమ్మ
బ్యారేజీ ప్రాకారంపై పరుగులు తీస్తున్న గాలిపటాల్లా జెండాలు…
మరో వైపు వైపు ఎగిరే నీటి అలలు…
మధ్యలో నిలబడి అన్నింటింకీ నేనే సాక్ష్యమంటున్న కొండలు.
ప్రకృతి తన చిత్రాన్ని గీస్తుంటే, మనిషి తన జీవితాన్ని సాగిస్తున్నాడు.
ఈ రెండు దారులు ఇక్కడ ఒకే చోట కలుస్తాయి.
అందుకే ఈ ప్రాంతం కేవలం దృశ్యం కాదు, విజయవాడ హృదయ స్పందన.
ఫోటోలు- పెదపోలు రవి ( ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్)