మరో 'పాక్ గూఢచారి' అరెస్టు

‘గూఢచర్యం ఆరోపణలున్న ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్‌కు సన్నిహిత సంబంధాలు’- పోలీసులు;

Update: 2025-06-04 09:46 GMT
Click the Play button to listen to article

పాక్‌కు గూఢచర్యం వహించాడన్న ఆరోపణలపై మరో యూ ట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ రాష్ట్రంలోని రూప్‌నగర్ జిల్లా మహలాన్ గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్ "జాన్ మహల్" పేరిట యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. భారతదేశ సమాచారాన్ని పాక్‌కు రహస్యంగా చేరవేస్తుందన్న ఆరోపణలకు ఇటీవల హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమెతో జస్బీర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌరవ్ యాదవ్ తెలిపారు. పాకిస్థాన్‌ (Pakistan) ఇంటెలిజెన్స్ అధికారి, ఐఎస్ఐ (ISI)కు పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్‌ అలియాస్ జుట్‌ రాంధావాతో సంబంధాలు ఉన్నాయని, పాకిస్తాన్ హైకమిషన్ నుంచి బహిష్కరణకు గురైన పాక్ జాతీయుడు ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమానికి జస్బీర్ హాజరై, అక్కడ పాక్ ఆర్మీ అధికారులు, వ్లాగర్లను జస్బీర్‌ కలిశాడని వివరించారు. జస్బీర్‌ మూడుసార్లు (2020, 2021, 2024) పాకిస్తాన్‌కు వెళ్లినట్లు గుర్తించామని, జస్బీర్ వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల్లో పాక్ ఆధారిత సెల్ నంబర్లు ఉన్నాయని చెప్పారు.

గూఢచర్యం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ నుంచి మంగళవారం ఒక ప్రభుత్వ ఉద్యోగి, పోలీసు కానిస్టేబుల్‌తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వాళ్ల అరెస్టు తర్వాతి రోజే జస్బీర్‌ను కూడా అరెస్టు చేశారు.

జైసల్మేర్ ఉపాధి కార్యాలయంలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO)గా పనిచేస్తున్న రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షకుర్ ఖాన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశాడనే ఆరోపణలపై గతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఖాన్ వారాల తరబడి భద్రతా సంస్థల నిఘాలో ఉన్నాడని, పాకిస్తాన్ హైకమిషన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో ముఖ్యంగా డానిష్, సోహైల్ కమర్‌తో ఎక్కువగా టచ్‌లో ఉన్నట్లు బయటపడిందని ఇన్‌స్పెక్టర్ జనరల్ (CID-సెక్యూరిటీ) విష్ణు కాంత్ గుప్తా తెలిపారు. ఇక జమ్మూ కాశ్మీర్‌లో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీసు కానిస్టేబుల్‌ అరెస్టు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా నిర్వాహకులకు సమాచారం ఇస్తు్న్నాడని ఆరోపణలతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.

గూఢచర్యం ఆరోపణలపై మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అజాజ్ అహ్మద్, శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ వసీం అహ్మద్ ఖాన్ అదుపులోకి తీసుకుని విచారించారు. అజాజ్ అహ్మద్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ ప్రచార సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. దాంతో ఆయనను అరెస్టు చేశారు.

జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యకు దారితీసిన ఉగ్రవాద కుట్రలో వసీం అహ్మద్ ఖాన్ పాత్ర ఉందని అతనిని అరెస్టు చేశారు. ఇక పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Tags:    

Similar News