బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు..
తీర్పు వెలువరించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్..;
కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లాదేశ్(Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఆరు నెలల జైలు శిక్ష(imprisonment) విధించింది. జస్టిస్ ఎండీ గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఛత్రా లీగ్ నేత షకీల్ అకాండ్ బుల్బుల్కు కూడా రెండు నెలల జైలు శిక్ష విధించింది ట్రిబ్యునల్. ఆమెను అరెస్టు చేసిన లేక లొంగిపోయిన రోజు నుంచి ఈ శిక్ష అమలుకానుంది.
రిజర్వేషన్ల అంశంపై షేక్ హసీనా తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశ్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనలను ఎక్కడిక్కడ అణిచివేయాలని సైన్యానికి ఆదేశాలివ్వడంతో సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో 11 మాసాల క్రితం షేక్ హసీనా దేశం వీడారు. ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉంటోంది.
ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే హసీనాకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను షేక్ హసీనా ఖండించారు.