లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(యూ) కథ ముగుస్తుంది: తేజస్వీ యాదవ్‌

మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకున్న జేడీ(యూ) అధినేత నితీష్‌ కుమార్‌పై తేజస్వీ యాదవ్‌ తన ఆగ్రహాన్ని వెల్లగక్కారు. ఆయనను గౌరవంగా సంబోధిస్తూనే చురకలంటించారు.

Update: 2024-01-28 14:02 GMT


బీహార్‌ ముఖ్యమంత్రిగా 9వ సారి ప్రమాణ స్వీకారం చేసిన జేడీ(యూ) అధినేత నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుమునుపు ఆయనపై తేజస్వియాదవ్‌ హాట్‌ కామెంట్లు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కథ ముగుస్తుందన్నారు.

ఆర్జేడీ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడైన తేజస్వి యాదవ్‌ గత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలతో కలిసి నితీష్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా నితీష్‌ అడుగులు వేశారు. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో నితీష్‌ ఆదివారం ( జనవరి 28న) మధ్యాహ్నం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రానికే ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్‌ కుమార్‌ సిన్హా, సామ్రాట్‌ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబోధిస్తూనే.. చురకలు..

తన మాజీ బాస్‌ను ఒకవైపు గౌరవనీయుడని సంబోధిస్తూనే.. అలసిపోయిన నాయకుడని నితీష్‌ను అభివర్ణించారు తేజస్వి. ‘‘మా ప్రభుత్వం సాధించిన అనేక విజయాల వల్ల సాధించిన క్రెడిట్‌తో నితీష్‌ కుమార్‌కు సమస్య ఉన్నట్లుంది’’అని వ్యాఖ్యానించారు.

‘‘2020 ఎన్నికల సమయంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఎగతాళి చేసేవారు. ఆ దిశగా పని చేసేలా చేశాను’’ అని గతాన్ని గుర్తుచేశారు తేజస్వీ యాదవ్‌.  ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీతో జతకట్టడానికి నితీష్‌కుమార్‌ ఎన్ని కారణాలు చెప్పినా..లోక్‌సభ ఎన్నికలలో ఆయనకు పరాజయం తప్పదన్నారు.

Tags:    

Similar News