పదేళ్ళ తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగులకు జరిగిన మేలెంత, కీడెంత?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులు తమ తమ సమస్యలు, ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు. అవి ఏ మేరకు నెరవేరాయి? పరిశీలిద్దాం.

Update: 2024-05-31 06:49 GMT

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులు, విద్యార్థులు, జర్నలిస్టుల, కళాకారుల, గ్రామీణ ప్రజల పాత్ర కీలకమైనది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి, ఆర్టీసి కార్మికులు, ప్రైవేటు స్కూలు యాజమాన్యం, ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, రచయితలు నిర్వహించిన పాత్ర, చేసిన త్యాగాలు మహోన్నతమైనది. సబ్బండ కులాలు, మహిళలు కూడా ఎక్కడికక్కడ జెఏసీలుగా ఏర్పడి ఉద్యమించిన చరిత్ర కళ్లముందే ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ తమ సమస్యలు, ఆకాంక్షలు నెరవేరుతాయని భావించారు. అవి ఏ మేరకు నెరవేరాయి? పరిశీలిద్దాం.

ఓపెన్ కాస్ట్ మైనింగ్ రద్దు ను విస్మరించారు

సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఆదిలాబాద్ నుంచి కరీంగనర్, వరంగల్, ఖమ్మం దాకా గోదావరి తీరం అంతా బొందల గడ్డగా వాతావరణ కాలుష్యంతో నిండిపోయి ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారు.

ఉద్యమ కాలంలో ఓపెన్ కాస్ట్ గనులను నిషేదిస్తామన్నారు. అందుకు విరుద్ధంగా కొత్తవాటికి అనుమతులిచ్చారు. లక్ష యాభైవేల మంది ఉన్న సింగరేణి కార్మికులు ననలభై వేలకు తగ్గిపోయారు. ఓపెన్ కాస్ట్ గనుల వల్ల యాంత్రికీకరణ పెరిగి ఉద్యోగాలు తగ్గిపోయాయి. బొగ్గు నాణ్యత కూడా బాగా తగ్గిపోయింది. ఉన్న కార్మికులకు మూడు నెలల జీతం బోనస్ గా ఇచ్చి జోకొట్టారు. వారసత్వ నియామకాలు చాలా ఆలస్యంగా చేపట్టారు.

ఓపెన్ కాస్ట్ గనులతో యాంత్రికీకరణతో, సింగరేణిలో మనం లక్షన్నర ఉద్యోగాలు కోల్పోయాము. సికాస జెఏసీలు, ఉద్యమ చైతన్యంతో ఎన్నో త్యాగాలు చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయా సింగరేణి ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేస్తూ వచ్చింది.

కవిత, హరీష్ రావు వంటి రాజకీయ నాయకుల ప్రమేయంతో మొత్తం ట్రేడ్ యూనియన్లు కుప్పకూలిపోయాయి. ఆర్టీసి ఉద్యోగులు , డ్రైవర్లు , కండక్టర్లు చేసిన పోరాటాలు చరిత్రాత్మకమైనవి. ఆర్టీసి జెఏసీలు ఏ పిలుపు ఇచ్చినా వెంటనే స్పందించారు. ఆర్టీసి సిబ్బందికి కమిషన్లు లేవు. సింగరేణి కార్మికులకు వచ్చినంత మేరకైనా రిటైరైనప్పుడు బెనిఫిట్స్ రాలేదు. అందులో నాలుగోవంతు కూడా అందలేదు. తాము పొదుపు చేసిన డబ్బుపై వడ్డీతో నెలకు రెండు వేల రూపాయలు పెన్షన్లాగా ఇస్తున్నారు.

 సింగరేణి కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన కీర్తి దక్కించుకున్న కవిత.

కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేశారు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమను ప్రభుత్వ శాఖలో భాగం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని ఆకాంక్షించారు. ఉద్యమ నాయకత్వం కూడా అంగీకరించింది. కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ట్రేడ్ యూనియన్ నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేసింది. అసలు సంఘాలు ఎందుకు అని మాట్లాడ్డం మొదలు పెట్టారు.

లక్ష ఇరవై ఐదువేలు ఉన్న తెలంగాణ ఆర్టీసి ఉద్యోగులు యాబై మూడు వేలకు తగ్గిపోయారు. ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసి బస్సులు, ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. ప్రైవేటు బస్సుల్లో పనిచేసేవారికి ఆర్టీసీలో పనిచేసేవారికున్న సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ప్రైవేటు బస్సులను, సిబ్బందిని ఆర్టీసీలో కలుపుకుంటారని ఆశించారు. అది జరగలేదు. ఆర్టీసి ఉ ద్యోగులను, సిబ్బందిని ప్రభుత్వ శాఖలో భాగం చేయలేదు. దాంతో నేటికీ వారికి సరైన పెన్షన్లు లేవు. గృహవసతి, వైద్య వసతి, పిల్లలకు విద్యావసతి అనేక సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఇలా ఆర్టీసీ ద్వారా పదేళ్ళలో ఒక లక్ష ఉ ద్యోగాలు పెరగాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు తగ్గిపోయాయి. కండక్టర్ను డైలీ వేజ్ మీద తీసుకోవడం ఆగలేదు.

విద్యుత్ శాఖలో ప్రభుత్వం కొంత మేలు జరిగింది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న తొమ్మిదివేల మందిని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చింది. ప్రైవేటు రంగం నుండి, ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసి చక్కగా కరెంట్ సప్లయ్ చేయడంలో విద్యుత్ ఉద్యోగులు మహత్తర పాత్ర నిర్వహించారు. తద్వారా ప్రభుత్వానికి ఎనలేని కీర్తి వచ్చింది. అందువల్ల వారికి ఇతోధిక సౌకర్యాలు, జీతభత్యాలు పెంచబడ్డాయి. నూతన నియామకాలు కూడా వెంటనే చేపట్టారు. అయితే, ఇక్కడ కూడా ఉద్యోగ సంఘాలను నిర్మూలించాలనుకున్నారు. కానీ వారు పకడ్బందీ నిర్మాణం కలిగి ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు.

రోడ్లు భవనాలు, తదితర సివిల్ ఇంజనీర్ల రంగంలో కొన్ని నియామకాలు జరిగాయి. ఎలాంటి పైరవీలు, అవినీతి లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేలాదిమంది విద్యావంతులను ప్రభుత్వం చూపిన ఖాళీల ప్రకారం కాస్త ఆలస్యంగానైనా నియామకాలు చేపట్టింది.

గురుకుల పాఠశాలలో నియామకాలు కూడా చక్కగా జరిగాయి. పోలీసు నియామకాలు కూడా సజావుగా సాగిపోయాయి. అవసరమున్న దానికన్నా రెట్టింపు పోలీసులను నియమించారు. ఉపాధ్యాయులను కూడా కాస్త ఆలస్యంగా నియామకాలు చేపట్టారు. అందుకు కారణం లేకపోలేదు. గురుకుల పాఠశాలలను విస్తరించడం, ప్రభుత్వ హాస్టళ్ళు ఉన్నచోట వాటిని అక్కడి స్కూళ్ళను కలిపి రెసిడెన్షియల్ స్కూళ్ళుగా మార్చాలనే ఆలోచన ఉండడం, రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యార్థులు పెరుగుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో స్కూళ్ళలో ఆమేరకు విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, అందువల్ల ఉపాధ్యాయులను రేషనలైజేషన్తో సర్దుబాటు చేయవచ్చని భావించడం జరిగింది.

రాష్ట్రమంతా ఉపాధ్యాయుల కొరత

నాలుగు కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరమైతే ఆ విద్యార్థులకు సైకిళ్ళు కొనివ్వడం, ఉచిత బస్ పాస్ ఇవ్వడం అనే ఆలోచనల వల్ల ఉపాధ్యాయ నియామకాలు ఆలస్యమయ్యాయి. ఈలోపే ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ పెరగడంతో ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. హాస్టళ్ళు, స్కూళ్ళు కలిపి గురుకుల పాఠశాలలుగా మార్చే ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు విద్యార్థులు ఉండడం లేదు. ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది. అది ఇంకా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్శిటీల్లో కొనసాగుతూనే ఉంది.

సర్వత్రా డాక్టర్ల కొరత

ప్రభుత్వ వైద్యశాలల్లో రెగ్యులర్ స్టాఫ్ను, డాక్టర్లను నియమించడం బాగా తగ్గిపోయింది. నిమ్స్ వంటి సంస్థల్లో 1994 నుండి కొన్ని శాఖల్లో కొత్త నియామకాలే లేవు. నర్సులు, సిస్టర్లు, ఆయాలు కింది వర్గాల నుంచి వచ్చి ఉద్యోగాలు వెతుక్కునేవారు. వారికి ఉద్యోగ భద్రత లేకుండా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో తాత్కాలిక నియామకాలు చేపట్టి వారికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. అవసరమైన మేరకు వైద్యశాఖలో నియామకాలు చేపడితే పదివేల మంది డాక్టర్లు లక్షమంది ఇతర నైపుణ్య సిబ్బంది నియామకాలు చేపట్టవచ్చు. ఆ పని చేయలేదు. ఇప్పటికైనా చేపట్టాలి. ఇందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా వైద్య విధాన పరిషత్తో గాని, జిల్లా సెలక్షన్ కమిటీతో గానీ, వేగంగా నియామకాలు చేయడం అవసరం.

ఉద్యోగుల రంగంలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించింది. జీతాలు పెంచింది. తెలంగాణ ఇంక్రిమెంట్ ఒకటి అదనంగా ఇచ్చింది. పేరివిజన్ చూసినప్పుడు సాధారణంగా 20 శాతం ఉండే అదనపు బెనిఫిట్ను 42 శాతం చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చింది. ఈ మేరకు ఉద్యోగులు ఎంతో సంతోషించారు.

యువకులు ఉద్యోగాలు కోల్పోయారు

అయితే 58 యేళ్లు ఉన్న రిటైర్మెంట్ వయస్సును 60 యేళ్ళకు పెంచారు. తద్వారా మూడేళ్ళపాటు ఖాళీ అయ్యే యాభై వేల ఉద్యోగాలు యువతరం కోల్పోయారు. యువతరంకు ఇచ్చే జీతం 35 వేలు అయితే రిటైరయ్యే ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ 75 వేలు. మొత్తం కలిసి లక్షా ఐదు వేలు. రిటైర్ కావాల్సిన ఉద్యోగులను మూడేళ్ళు అలాగే ఉంచడం వల్ల లక్షా 50 వేలకు పైగా నెల నెలా ఇవ్వాల్సి వచ్చింది. ఆ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసి, వారి తల్లిదండ్రులకు జీతం పెంచడం వల్ల ఉద్యోగ వయస్సు పెంచడం వల్ల సమాజంలో తీవ్ర సంఘర్షణ, అసమానతలు , కుటుంబంలో కలతలు పెరిగాయి.

ఆధునిక టెక్నాలజీ ఐటి సాధనతో బోధనలు, కంప్యూటరీకరణ ఈ రిటైరయ్యే ఉద్యోగులకు కష్టం. అందువల్ల ప్రభుత్వ నడక కూడా మందగించింది. ఇదంతా ప్రభుత్వం ముందు చూపు లేక చేసిన స్వయంకృత అపరాధం. రిటైరైతే ఇవ్వాల్సిన ప్రావిడెంట్ ఫండ్ , చెల్లించాల్సిన ఇతర భత్యాలకు బడ్జెట్ లేదు అనే పేరిట మూడేళ్ళు రిటైర్మెంట్ వయస్సు పెంచారు. అయితే ఆరు లక్షల కోట్ల అప్పుచేసి ఏం చేసినట్టు? ఆ లెక్కలు లేవు.

అది కాకుండా ప్రజల నుండి బాండ్స్ రూపంలో డిపాజిట్ సేకరించి రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించాల్సిన డబ్బులు సర్దవచ్చు. రిటైర్ ఉద్యోగులకే బాండ్స్ ఇచ్చి బ్యాంకు గ్యారంటీ ఇస్తే వాళ్ళు అవసరమున్న మేరకు బ్యాంకులో కుదువబెట్టి తమ తమ మొత్తాలను విత్ డ్రా చేసుకునేవారు. దీనివల్ల గొప్ప మేలు కూడా జరిగేది. రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన డబ్బులు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అళ్ళుల్లు, మనుమలు తలా ఇంత గుంజుకోకుండా స్థిరంగా పెట్టుబడిగా ఉండిపోయేది.

ఈ విషయాలు అనేక కోణాల్లో వివరించినప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం వినిపించుకోక అటు అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులకు, ఇటు యువతరానికి ఎనలేని నష్టం చేసింది. మూడేళ్ళు రిటైర్మెంటు వయస్సు పెంచడంవల్ల 85 వేల మంది ఉద్యోగులకు మూడేళ్ళపాటు ప్రమోషన్లు ఆగిపోయాయి. వారు కూడా అసంతృప్తి పాలయ్యారు. ఇలా అందరిని అసంతృప్తికి గురి చేసిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకులుగా మారారు.

ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేయాలనుకోవడం అందుకు ప్రధాన కారణం. మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయితీలల్లో, ఆర్టీసి బస్టాండ్లలో పారిశుద్య కార్మికులను నియామకాలు చేపట్టకుండా తీవ్ర అన్యాయం చేశారు. పేదవర్గాలైన వీరికి ఉద్యోగ భద్రత, జీతభత్యాలు ఇస్తే వారి పిల్లలు చదువుకుని మధ్య తరగతి ఉద్యోగులుగా, నిపుణులుగా ఎదిగి ఉండేవారు. డైలీ వేజ్ పై నియమించడం వల్ల, ఔట్ సోర్సింగ్ వల్ల లక్షలాది పారిశుద్య కార్మికులు, వారి పిల్లలు మధ్య తరగతిగా ఎదిగే క్రమం ఆగిపోయి పేదలుగా మిగిలిపోతున్నారు. వీరందరిని పే స్కేల్ పై నియామకాలు చేపట్టి నూతన ప్రభుత్వం వారికి జీవన భద్రత కల్పించడం అవసరం.

అయిదు లక్షల ఉద్యోగాలు సాధ్యమే

ఇలా ఆయా రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు నియమించడం సాధ్యమే. జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా నియామకాలు చేపడితే ఆరు నెలల్లోనే ఐదు లక్షల ఉద్యోగాలు నియమించవచ్చు. ఇంత గొప్ప అవకాశాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం వదులుకున్నది. దాని ఫలితాన్ని ఓటమి రూపంలో అనుభవిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఇంకా ఇతర శాఖలను, రంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మరో లక్ష ఉద్యోగాల కల్పన చేపట్టే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News