సినీరంగం గద్దర్ కి ఇచ్చే గౌరవమిదేనా?
తెలంగాణ చరిత్ర, సాహిత్య సంస్కృతి వైభవాలను ఎలుగెత్తి చాటే విధానప్రక్రియ రూపకల్పనకు కృషి ఎక్కడ?;
-రమణా చారి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం అనేక విమర్శలకు తెరలేపింది.తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సినీ రంగానికి గద్దర్ అవార్డులను ప్రకటించింది. కానీ, గద్దర్ ఆశయాలకు, ఆలోచనలకు పూర్తి భిన్నంగా అవార్డుల ఎంపిక ప్రధానోత్సవం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ సభ్యులకు గానీ, జ్యూరీ సభ్యులకు గానీ గద్దర్ ఆకాంక్షలతో, ఆచరణ తో సంబంధం లేకుండా విజేతలను నిర్ణయించి నట్లు కనబడుతుంది. అసలు చిత్రమేమంటే? సినిమా అవార్డులను తిరస్కరించిన గద్దర్ పేరిటనే అవార్డులు ప్రకటించడం మరింత విడ్డూరంగా మారింది. ఇదిలా ఉండగా అంతరించిపోతున్న జానపద కళలు, తెలంగాణ కళా రూపాలు, తెలంగాణా సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని, ఉద్యమ చరిత్రను, త్యాగాల గాయాలపై ఎలాంటి అవగాహన లేకుండా అవార్డులను ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ పరిశ్రమ మరింత కుంటు పడగా, ఆంధ్ర నిర్మాతల, కళాకారులకు మున్నెన్నడూ లేనంతగా హైదరాబాద్ లో ఆతిథ్యం లభించింది.
హైదరాబాదులో ప్రపంచ అందాల పోటీల సందర్భంగా వచ్చిన అపవాదు పూర్తిగా తొలగిపోక ముందే, అవార్డు కార్యక్రమం జరిగింది. అందాల నాయికలు ఇక్కడ అరాచకాలను ఎంతో సున్నితంగా బహిర్గతపరిచినా ఎలాంటి చర్యలు లేకుండా, వ్యవహరించారన్న అపకీర్తి మూట కట్టుకున్నారు. సినిమా అవార్డుల సందర్భంలోనూ అలాంటి మరోవిధమైన విమర్శకి తావిచ్చారు. అంగరంగ వైభవంగా నిర్వహించడం లో చూపిన శ్రద్ధ, అవార్డు ప్రత్యేకతలోని అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు గద్దర్ని గాని తెలంగాణ కళారూపాలను గాని, కళాకారుల ప్రాధాన్యతను గాని పట్టించుకోలేదు.
తెలంగాణ ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను, వేష భాషలను గౌరవించకుండా వ్యవహరించిన తీరు ఆందోళనకు గురి చేసింది. తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ తీసిన ‘రజాకార్’ సినిమాకు అవార్డు నివ్వడం చరిత్రక అవగాహన లోపానికి నిలువెత్తు నిదర్శనం.
జమీందారులకు, జాగీర్దార్లకు, దేశముఖ్ లకు వ్యతిరేకంగా పీడిత ప్రజలు అత్యంత సాహసోపేతంగా జరిపిన సాయుధ రైతాంగ పోరాటాన్ని కనుమరుగు చేసి, హిందూ ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించారు. తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తీసిన సినిమాకు అవార్డు ప్రకటించి నట్లు అయ్యింది. దీనితో వివిధ స్థాయిలో ప్రభుత్వాల అంతర్గత రాజకీయ సంబంధాలను బహిర్గతం చేసింది.
శేషాచలం అడవుల్లో ఎర్ర చందన స్మగ్లర్ కథాంశంతో రూపొందిన సినిమా హీరోకు అవార్డుని ఇచ్చారు. అడవులను నరకి స్మగ్లింగ్ చేయడం,పర్యావరణ విధ్వంసమే కాక, యువతకు చెడు మార్గంలో నడిపే హీరో పాత్ర ప్రేరణ కాగలదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, సంస్కృతి సాంప్రదాయాలను తుంగలో తొక్కి రంగుల ప్రపంచంలో గద్దర్ ఆశయాలను కనుమరుగు చేశారు. తెలంగాణ ప్రాంత కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
సినిమా రంగం అనేది అసలు పరిశ్రమమే కాదన్న విషయాన్ని ప్రజలందరూ అవగాహన చేసుకోవాలి. హీరోలకు, హీరోయిన్లకు కోట్లాది రూపాయల రెన్యూమరేషన్ ఇస్తూ, తర్వాతి స్థానంలో పనిచేసే కళాకారులందరి శ్రమకు ( తోటి డాన్సర్లు, అసిస్టెంట్లు, కెమెరామెన్, మేకప్ మ్యాన్, సెట్టింగ్ అమర్చి వారు ఇలా ఎందరో ) ఇచ్చే సొమ్ము అంతంత మాత్రమే. వారివి భద్రత లేని జీతాలు, జీవితాలు. పరిశ్రమల్లో కార్మికులకు ఉండే హక్కులు గాని, జీతాలు కానీ, భద్రత కానీ సినిమా రంగంలో ఉండదు. సినీ కార్మికుల కోసం పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మందడి ప్రభాకర్ రెడ్డి, కత్తి కాంతారావు గా జాన పదరంగాన్ని ఉర్రూతలూగించిన నటుడు కాంతారావు గాని, పైడి జయరాజును, బి ఎస్ నారాయణ వంటి ఎందరో తెలంగాణ ప్రముఖుల పేర్లను గుర్తు చేసుకోవడం గాని, ఉచ్చరించడానికి గాని ప్రభుత్వ పెద్దలు ఇష్టపడలేదు. గద్దర్ నుండి పొందిన చైతన్యం ఏమిటో వారికే తెలియాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేవలం సినీ రంగం మాత్రమే కాదు, కళలు, భాష,యాస, సంస్కృతిక వైభవం, కవులు కళాకారులు, రచయితలు, మేధావులు, ఉద్యమకారులు, త్యాగమూర్తులు మీడియా, చిత్రకళ, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం, అస్తిత్వ పరిరక్షణ. తెలంగాణ సినిమాకు చరిత్రను సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బి. నరసింగరావు చేసిన సూచనలు వేటినీ గద్దర్ అవార్డులు కమిటీ, జ్యూరీ పట్టించుకున్నట్లు లేదు. ప్రచార అంబాసిడర్లుగా పనికొచ్చే సినీ తారలను ముందుంచి అవార్డుల తంతు ముగించారు. తెలంగాణ సినీ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రాంత నటులు, నిర్మాతలు, దర్శకులెవ్వరికీ స్థానం లేకుండా చేశారు. పండితులను,పామరులను ముప్పించగల అత్యంత ప్రతిభావంతమైన గాయకుడు గద్దర్. రాజకీయంగా ఆయన తెలంగాణ పౌర సమాజంలో నిర్వహించిన పాత్రను ప్రచారం లేకుండా చేసే ప్రయత్నం కనబడింది.
ఒక సామాజిక విప్లవకారుడు, ప్రత్యేక తెలంగాణ. ఉద్యమకారుడు, పీడత ప్రజల విముక్తి కోసం ఆజన్మంతం పరితపించిన వాడు గద్దర్. సామాజిక ఉత్పత్తి కులాల విశిష్టతను చాటి చెప్పిన వాడు గద్దర్. ఇల్లు చీపురు నుండి యాంకర్ ముక్కును కూడా వదలకుండా, వివిధ ప్రభుత్వాల పాలకుల పనితీరును సైతం వదిలిపెట్టకుండా పాటలు రాసి బహుళ జనాన్ని మెప్పించినవాడు గద్దర్. అలఓకగా పాటలు రాయగల, తన గానంతో, హావ భావ ప్రదర్శనతో ప్రజలను రంజింప చేసిన ప్రతిభాశాలి గద్దర్. రాజ్య స్వభావాన్ని తేట తెల్లంచేసి, రాజ్యాంగ అమలు కోసం నిలిచినవాడు గద్దర్. రాజ్య హింసకు భయపడకుండా,ప్రభుత్వాలు సృష్టించిన కోబ్రాల బెరింపులకు భయపడకుండా, తుపాకీ కాల్పులకు వేరవకుండా, పౌర ప్రజాస్వామ్య హక్కుల కోసం ఎదురోడ్డి నిలిచిన పోరాడినవాడు గద్దర్. తెలంగాణకే పరిమితం కాకుండా వివిధ భాషలలో పాటతో, ఆటతో, బాణీ లతో ప్రపంచ స్థాయి గుర్తింపు, ఆధారణ పొందిన వాడు గద్దర్. ఇంతటి ప్రతిభాశాలి, ప్రజ్ఞావంతుడైన గద్దర్ పై, తెలంగాణా, సాహిత్య సంస్కృతి పై ఏమాత్రం అవగాహన లేకుండా ఈవెంట్ నిర్వాహకులకు బాధ్యతను అప్పగించి అవార్డుల కార్యక్రమం నిర్వహించడం గద్దర్ ను తీవ్రంగా అవమానించడమే కాగలదు. నిజానికి ఇది పాలకుల చిత్తశుద్ధిని శంకించే విధంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడవలసినది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలంలో తెలంగాణ చరిత్ర, సాహిత్య సంస్కృతి వైభవాలను ఎలుగెత్తి చాటే విధానప్రక్రియ రూపకల్పనకు కృషి చేయాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నది