పొలిటికల్ టర్న్ తీసుకున్న లా విద్యార్థిని శర్మిష్ఠ పనోలి అరెస్టు..
"వాక్ స్వాతంత్య్రానికి అవమానకరం" అని పేర్కొన్న డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..;
‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఒక మతం గురించి వివాదాస్పద పోస్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూణేకు చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలి(Sharmistha Panoli)ని కోల్కతా(Kolkata) పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అదే పనోలికి కొంతమంది రాజకీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. డచ్ ఎంపీ (Dutch MP) గీర్ట్ వైల్డర్స్ (Geert Wilders) ఆమె అరెస్టును ఖండించారు. "వాక్ స్వాతంత్య్రానికి అవమానకరం" అంటూ ఆమె హక్కులను కాపాడుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా స్పందించారు. పనోలి కేసులో "న్యాయబద్ధంగా" వ్యవహరించాలని కోల్కతా పోలీసులను కోరారు.
డచ్ ఎంపీ మద్దతు..
"ధైర్యవంతురాలైన శర్మిష్ట పనోలిని విడుదల చేయండి. ఆమెను అరెస్టు చేయడం వాక్ స్వేచ్ఛకు అవమానం. పాకిస్తాన్, ముహమ్మద్ గురించి నిజం మాట్లాడినందుకు ఆమెను శిక్షించకండి. ఆమెకు @narendramodi సహాయం చేయండి" అని ఎక్స్లో పోస్టు చేశారు వైల్డర్స్.
Free the brave Sharmishta Panoli!
— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025
It’s a disgrace for the freedom of speech that she was arrested.
Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad.
Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2
గతంలో నుపుర్ శర్మకు ..
ప్రవక్తపై 2022లో బీజేపీ(BJP)కి చెందిన నూపుర్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు ఆమెకు కూడా వైల్డర్స్ మద్దతు పలికారు. "నిజం మాట్లాడినందుకు ఇస్లామిస్టులు ఆమెకు బెదిరింపులకు గురిచేశారు. అయితే ధైర్యవంతురాలైన నూపుర్ శర్మకు నేను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతూ సందేశం పంపాను. స్వేచ్ఛను ప్రేమించే ప్రజలు ఆమెకు మద్దతు పలకాలి. భారత్ను సందర్శించేటప్పుడు ఆమెను నేను కలుస్తాను, " అని వైల్డర్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
‘గతంలో ఎందుకు స్పందించలేదు’
శర్మిష్ఠ పనోలి పోస్టుపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. "దైవదూషణను ఖండించాలి" అంటూనే లౌకికవాదాన్ని "కవచం"గా ఉపయోగించకూడదని నొక్కి చెప్పారు. "శర్మిష్ఠ తన తప్పును అంగీకరించింది. వీడియోను తొలగించి క్షమాపణ కోరారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆమెపై చర్య తీసుకున్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు, TMC ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన బాధ గురించి ఎందుకు స్పందించలేదు" అని మండిపడ్డారు.
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
— Pawan Kalyan (@PawanKalyan) May 31, 2025
But what about the deep, searing pain inflicted… pic.twitter.com/YBotf34YYe
'సనాతనవాదులపై చర్య'
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి(Suvendu Adhikari) కూడా టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో "సనాతనవాదులపై మాత్రమే చర్యలు తీసుకుంటారు" అని ఆరోపించారు. పనోలిని కావాలని అరెస్టు చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొ్న్నారు. ఒక వర్గం మద్దతు వారి ఓటు బ్యాంకు కోసం యువ హిందూ మహిళను అరెస్టు చేయడం దారుణం అని అన్నారు.
'ఇది ప్రజాస్వామ్యం కాదు'
కోల్కతాలో ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు హాల్ నుండి బయటకు వస్తూ శర్మిష్ఠ విలేకరులతో.."ఈ వేధింపులను చూస్తే.. ప్రజాస్వామ్యం లేదనిపిస్తుంది" అని పేర్కొన్నారు.
పనోలి పోస్టులో ఏముంది?
ఆపరేషన్ సిందూర్ సమయంలో కొంతమంది బాలీవుడ్ నటులు మాట్లాడకపోవడాన్ని విమర్శిస్తూ 22 ఏళ్ల పనోలి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. అందులో ప్రవక్త ముహమ్మద్, ఒక నిర్దిష్ట సమాజం గురించి చేసిన పనోలి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు అందడంతో.. ఆమెను శనివారం హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్టు చేశారు. జడ్జి ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.