వంతెన కూలిన ఘటనలో 15కి చేరిన మృతుల సంఖ్య

మరో ముగ్గురి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు..;

Update: 2025-07-10 10:46 GMT
Click the Play button to listen to article

గుజరాత్‌(Gujarat) రాష్ట్రం వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై నిర్మించిన వంతెన కూలిన ఘటనలో మరో నాలుగు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 15కు చేరుకుంది. తప్పిపోయిన మరో ముగ్గురి కోసం NDRF, SDRF బృందాలు గాలిస్తున్నాయి.

‘‘ఇంకా ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉంది. నదిలో ప్రాణాలతో ఉన్న వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) గాలిస్తున్నాయి. సహాయక బృందాలు నదిలో 4 కిలోమీటర్ల వరకు గాలించాయి. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశాయి. తప్పిపోయిన వ్యక్తుల గురించి వారి కుటుంబసభ్యులు మా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేయవచ్చు" అని వడోదరా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.

నలభైఏళ్ల  నాటి వంతెన..

బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాద్రా ప్రాంతంలోని మహిసాగర్‌ నదిపై నిర్మించిన గంభీర వంతెన రెండు పిల్లర్ల మధ్య స్లాబ్‌ కూలిపోయింది.

ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటో నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ అక్కాతమ్ముళ్లు. బాలిక వయసు 4 సంవత్సరాలు కాగా బాలుడి వయసు రెండేళ్లు. ఈ ప్రమాదంలో చిన్నారుల తండ్రి మృతి చెందగా.. తల్లి ప్రాణాలతో బయటపడింది. మరో తొమ్మిది మందిని సహాయక బృందాలు రక్షించాయి.

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు నదిలో పడిపోయిన తర్వాత ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

సహాయక బృందాలు తొమ్మిది మందిని రక్షించాయని, వీరిలో ఐదుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వడోదర జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహన్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన చెప్పారు. వడోదరా-ఆణంద్‌ పట్టణాలను కలిపే ఈ వంతెన 1985లో నిర్మించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News