టేకాఫ్ అయిన 5 నిముషాలకే కూలిన విమానం..
మెడికల్ కాలేజీపై కూలిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ - విమానంలో 169 మంది భారతీయులు - దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ;
గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmadabad)లో ఘోర విమాన ప్రమాదం (Plane crash) చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టుకు సమీపంలోని మేఘాని ప్రాంతంలో జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. విమానంలో 12 మంది సిబ్బందితో పాటు 230 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. టేకాఫ్ అయిన 5 నిముషాలకే ఈ దుర్ఘటన జరిగింది.
825 అడుగుల ఎత్తు నుంచి విమానం బీజే మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోయింది. విమానం కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆకాశంలో దట్టమైన పొగ అలుముకుంది. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, పోర్చుగల్ కు చెందిన వారు 7, ఒక కెనడియన్ ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు శిశువులు, 12 మంది పిల్లలు ఉన్నట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణిని కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. చాలామంది ప్రయాణికులు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఘటన వివరాల కోసం హెల్ప్ లైన్ (నెం. 1800 5691 44) ఏర్పాటు చేశారు.