మా కూటమే అధికారంలోకి వస్తుంది.. గెలిచే సీట్ల సంఖ్య చెప్పిన ఖర్గే

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.

Update: 2024-06-01 13:44 GMT

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి కనీసం 295 స్థానాల్లో విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో ఇండి కూటమి సీనియర్ నేతలతో సమావేశమైన అనంతరం ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు.

జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కోసం నిర్వహించిన ఈ సమావేశానికి బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ, కాశ్మీర్ పార్టీ పీడీపీలు దూరంగా ఉన్నాయి. ఈ సమావేశంలో అన్ని పార్టీల నుంచి వివరాలు తీసుకున్న తరువాతనే ఈ అంకెకు చేరుకున్నామని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ-ఎం, సీపీఐ, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) సీనియర్ నేతలు సమావేశానికి హాజరై చివరి దశ పోలింగ్ జరుగుతున్నప్పటికీ చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నందున తాము సమావేశానికి హాజరు కాబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా, వ్యక్తిగత కారణాల వల్ల పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సమావేశానికి హాజరుకాలేదు. "మా అమ్మ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నందున నేను వెళ్ళకపోవచ్చు" అని ఆమె ఓ జాతీయ మీడియాకి చెప్పారు.
'భారతదేశానికి కొత్త ఉషస్సు'
శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అనిల్ దేశాయ్, సీతారాం ఏచూరి, అరవింద్ కేజ్రీవాల్, భగవత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, చంపై సోరెన్, కల్పనా సోరెన్, టిఆర్ బాలు, ఫరూక్ అబ్దుల్లా, డి రాజా, ముఖేష్ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
“జూన్ 4 భారతదేశానికి కొత్త ఉదయానికి నాంది పలుకుతుంది. ఈరోజు జరిగే ఇండి బ్లాక్ నాయకుల సమావేశంలో, DMK తరపున మా పార్టీ కోశాధికారి, DMK పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరు పాల్గొంటారు" అని డిఎంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ 'ఎక్స్'లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇది అనధికారిక సమావేశమని ఖర్గే ప్రకటించారు. సమావేశం జరగడానికి కంటే ముందు ఖర్గే మాట్లాడుతూ, కౌంటింగ్ రోజున వారు ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలి. ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఈవీఎంల గురించి లేదా ఫారమ్ 17సి వినియోగం గురించి మాత్రమే చర్చిస్తారని చెప్పారు.
కౌంటింగ్ సన్నాహాలను చర్చించడం కోసమే ఈ సమావేశం జరిగిందని, ఫారం 17సీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ ఇప్పటికే తన రాష్ట్ర యూనిట్లకు చెప్పిందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా ఏడో, చివరి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శనివారం జరుగుతోంది.



Tags:    

Similar News