కర్ణాటకలో బైక్ టాక్సీల నిలిపివేత
నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు..;
కర్ణాటక(Karnataka)లో బైక్ టాక్సీ(Bike Taxi) సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ నెల 16 నుంచి ఆపేయాలని కర్ణాటక హైకోర్టు(Karnatak High Court) ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి ఉబెర్, ఓలా, రాపిడో బైక్ టాక్సీలు కనిపించవు. ప్రస్తుత చట్టాల ప్రకారం బైక్ టాక్సీ సేవలు చట్టవిరుద్ధమంటూ రవాణా శాఖ బైక్ ట్యాక్సీ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. కమర్షియల్ వెహికల్స్ను మాత్రమే ఆ సేవలకు వినియోగించాలని నోటీసులో పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ సర్వీసు ప్రొవైడర్లు కోర్టును ఆశ్రయించారు.
స్టే ఇవ్వని హై కోర్టు..
ఉబెర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ANI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీళ్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వి. కామేశ్వర్ రావు, న్యాయమూర్తి శ్రీనివాస హరీష్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ కేసును జూన్ 24కు వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు కోర్టు నోటీసు జారీ చేసింది.