ఢిల్లీ విమానాశ్రయంలో కొనసాగుతున్న విమానాల రాకపోకలు
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య సర్వీసులను ప్రారంభించామన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్..;
భారత్ - పాక్ (India-Pakistan) మధ్య ఉద్రిక్త వాతావరణానికి తెరపడినా.. భద్రతా చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆదివారం తెలిపారు. సాధారణంగా పాక్ గగన తలం మీదుగా 25 రూట్లలో వివిధ దేశాలకు విమానాలు వెళ్తా్యి. ఆపరేషన్ సిందూర్ మొదలైన తర్వాత పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. కాల్పుల విరమణకు అంగీకరించిన పాక్ విమానాల రాకపోకలకు అనుమతిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
"ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. గగనతల పరిస్థితుల మార్పులు, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని విమానాల షెడ్యూళ్లలో మార్పులు చేశాం,’’ అని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ (DIAL) ‘ఎక్స్’ (X) లో పేర్కొంది.
ప్రయాణికులకు సూచనలు..
ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆన్లైన్లో విమాన సర్వీసుల వివరాలు తెలుసుకుని ఇంటి నుంచి బయలుదేరాలని డయల్ కోరింది. విమానాశ్రయం చేరుకున్నాక..భద్రతా సిబ్బంది,ఎయిర్లైన్ సిబ్బందితో సహకరించాలని కోరింది. సాధారణంగా ఢిల్లీ(Delhi) విమానాశ్రయం రోజుకు సుమారు 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తాయి.