ఆపరేషన్ సిందూర్‌ | లా స్టూడెంట్ అరెస్టు

ఆపరేషన్ సిందూర్‌పై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన లా విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు.;

Update: 2025-05-31 11:30 GMT
Click the Play button to listen to article

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు కోల్‌కతా పోలీసులు గురుగ్రామ్‌(Gurugram)కు చెందిన లా విద్యార్థినిపై కేసు నమోదు చేశారు. సింబయాసిస్ లా స్కూల్‌లో నాల్గవ సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల శర్మిష్ఠ పనోలి తన ఇన్‌స్టా ఖాతాలో ఒక వీడియో పోస్టు చేశారు. అది బాగా వైరలైంది. ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుని అగౌరవకర, అవమానకర వ్యాఖ్యలతో కూడిన వీడియోను పోస్టు చేసిన పనోలిని వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ స్టేషన్లకు ఫోన్లు వచ్చాయి. కోల్‌కతాలోని ఒక పోలీస్ స్టేషన్‌లో ఒకరు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోర్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరికృష్ణ పాయ్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.

భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 196(1) (ఎ) (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష, కులం లేదా సమాజం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 299 (ఏ తరగతి పౌరుల మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు), 352 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 353(1)(సి) (ప్రజా దుశ్చర్యలను ప్రేరేపించే ప్రకటనలు) కింద కేసు ఫైల్ చేశారు. పనోలిని గుర్గావ్ కోర్టులో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ రిమాండ్‌పై కోల్‌కతాకు తీసుకువస్తారని సమాచారం.

వ్యాఖ్యలకు క్షమాపణ..

తన అరెస్టుకు ముందు ఎక్స్‌లో పనోలి ఇలా రాసుకొచ్చారు. "నేను బేషరతుగా క్షమాపణ కోరుతున్నా. వీడియోలో వ్యాఖ్యలు నా వ్యక్తిగతం. ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. ఇక నుంచి పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉంటా. దయచేసి నన్ను క్షమించండి’’ అని పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అశోక విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ అలీఖాన్ మహ్ముదాబాద్‌ను మే 18న హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు సుప్రీంకోర్టు మే 21న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Tags:    

Similar News