పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు

మూడు నెలలుగా జీతాలు లేవు. రాజకీయ ఒత్తిళ్లతో తొలగిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి.

Update: 2024-10-06 13:04 GMT

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్‌ వాటర్‌ క్వాలిటీ మోనిటరింగ్‌ లేబొరేటరీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ను మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కలిశారు.

రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్‌ జీతాలు క్లీయర్‌ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు.
ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి సుజన కుమారి అనే దివ్యాంగురాలు పవన్‌ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో గత పదేళ్లుగా హెల్పర్‌ గా పని చేస్తున్న తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు. దీనిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు.
Tags:    

Similar News