సాగర గర్భంలో మురిసిన మువ్వన్నెల పతాకం..

78వ స్వాతంత్ర్య వేడుకలను భారత్ ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Update: 2024-08-15 11:13 GMT

78వ స్వాతంత్ర్య వేడుకలను భారత్ ఘనంగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొన్ని దేశాలు తమ కార్యాలయాల్లో త్రివర్ణాన్ని రెపరెపలాడిస్తూ చెప్తే మరికొన్ని దేశాలు గగన తలంలో భారత జాతీయ పతాకాన్ని తలుక్కుమనిపించాయి. ఈ నేపథ్యంలోనే విశాఖ సాగరంలో స్కూబా డ్రైవర్లు తమదైన రీతిలో దేశభక్తి చాటుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా సాగర గర్భంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. లెహెరావో తిరంగా అంటూ వారు తమ దేశభక్తిని చాటుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ స్కూబా డైవర్లు ఇలా వినూత్నంగా మన అభిప్రాయాలను పంచుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇదే విధంగా చేశారు.

అప్పుడు రాముడు..

500 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత ఆ రాఘవ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా విశాఖలోని స్కూబా డైవర్లు ఇదే విధంగా రామునిపై తమకున్న భక్తిని చాటుకున్నారు. సముద్రంలో 20 అడుగుల లోతులో రాముడి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అప్పుడు కూడా వీరి ఫీట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. అదే విధంగా ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కూడా వారు సాగర గర్భంలో జరుపుకున్నారు. దేశభక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ అనే నినాదంతో వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

78 అడుగుల లోతులో

దేశం ఈరోజు తన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న క్రమంలో స్కూబా డైవర్లు కూడా సముద్ర గర్భంలో 78 అడుగుల లోతులో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. నేవీ మాజీ సైబ్ మెరైనర్, స్కూబా ఇన్‌స్ట్రక్టర్ బలరాం నాయుడు నేతృత్వంలో నలుగురు స్కూబా డైవర్ల బృందం ఈ ఘనత సాధించింది. ఋషికొండ తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఫీట్ చేశారు. ఈ సందర్భంగానే ప్లాస్టిక్ వేస్టేజ్‌ నుంచి సముద్రాన్ని కాపాడాలని పిలుపినిచ్చారు.

రెండు గంటలు సాగిన లెహెరావో తిరంగా

సముద్ర గర్భంలో స్కూబా డైవర్లు చేపట్టిన ఈ ఫీట్‌ను పూర్తి చేయడానికి రెండు గంటల సమయం పట్టింది. సముద్ర గర్భంలో అరగంట పాటు జాతీయ జెండాను రెపరెపలాడించామని, దీనిని కెమెరాలో షూట్ చేయడం మరో ఫీట్ అని బలరాం నాయుడు చెప్పారు. ఈ ఫీట్ కోసం చాలా కష్టపడ్డామని చెప్పారు.

Tags:    

Similar News