గుడివాడ ఘరం.. ఘరం.. ఓవైపు చంద్ర బాబు.. మరోవైపు కొడాలి నాని

కృష్ణా జిల్లా గుడివాడ గురవారం వేడెక్కనుంది.. ఉప్పు నిప్పుగా ఉండే ఈ ఇద్దరు ఒకే ఊళ్లో ఉంటే ఏమవుతుంది?

Update: 2024-01-17 16:00 GMT
గుడివాడలో వెలిసిన హోర్డింగ్‌

కృష్ణా జిల్లా గుడివాడ గురవారం వేడెక్కనుంది. ఇందుకు ఎన్టీఆర్‌ వర్థంతి వేదిక కానుంది. ఓవైపు చంద్రబాబు.. మరోవైపు ఆయన్ను తూర్పారబట్టే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఉప్పు నిప్పుగా ఉండే ఈ ఇద్దరు ఒకే ఊళ్లో ఉంటే ఏమవుతుంది? ఇప్పడందర్లోనూ అదే ఉత్కంఠ.. పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది.

రా.. కదిలి రా అంటున్న చంద్రబాబు..


మాజీ సీఎం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పిస్తారాయన. అది పూర్తికాగానే గుడివాడలో రా.. కదలి రా.. కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

రా.. కదలి రా.. సభ ఏర్పాట్లను టీడీపీ ముఖ్య నేతలంతా దగ్గరుండి పరిశీలించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌తోపాటు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందులో భాగంగా గుడివాడలో భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి, బ్యానర్లు కట్టారు.

బలప్రదర్శనకు సిద్ధమైన టీడీపీ

కేశినేని నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. గుడివాడలో రా.. కదలిరా సభను తమ బలప్రదర్శనగా భావిస్తున్న టీడీపీ.. ముదినేపల్లి మార్గంలో బహిరంగ సభా వేదికను సిద్ధం చేస్తోంది. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది తెలుగుదేశం.

నేనే ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహిస్తా..

మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వతహాగా ఎన్టీఆర్‌ అభిమాని అయిన కొడాలి నాని.. ఈ ప్రోగ్రామ్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

పోటాపోటీ ఫ్లెక్సీలు

అటు టీడీపీ-ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బ్యానర్లను చింపేసి తగులబెట్టారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News