ఏపీలో మద్యం పాలసీపై ఉరింపులు ఎందుకు?

మద్యం పాలసీని ప్రకటించకుండా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా ఊగిసిలాడుతూనే ఉంది. దీంతో కొత్త బ్రాండ్లు వస్తాయన్న మందు ప్రియులకు నిరాశ తప్పడం లేదు.

Update: 2024-08-07 12:53 GMT

అదిగో.. ఇదిగో.. కొత్త మద్యం పాలసీ వస్తుంది, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి, రిటైల్‌ అమ్మకాలు, ప్రొక్యూర్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్‌ ధరల నిర్థారణ వంటి పలు విధానాలు ఉంటాయని చెబుతున్న ప్రభుత్వం, దుకాణాలు ప్రభుత్వం నిర్వహణలో ఉంటాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా? అనేది మాత్రం ఇంత వరకు నిర్థారించ లేదు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది. షాపుల్లో స్టాక్‌ అయిపోగానే కొత్త మద్యం బ్రాండ్లు మార్కెట్‌లోకి వస్తాయని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. నూతన మద్యం విధానంపై అధ్యయనం చేస్తున్నమని చెబుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు నెలలు పూర్తి అయినా మరో నెల రోజులు పడుతుందని చెబుతోంది. మొత్తానికి నూతన మద్యం పాలసీ అక్టోబరు 1 నుంచి అమలలోకి వస్తుందన్నారు. ఆ పాలసీ ఎలా ఉంటుందో అనేది స్పష్టం చేయడం లేదు. ఇదీ ఇప్పుడు మద్యం ప్రియుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పాలసీ ప్రకటించకుండా, పాత బ్రాండ్లు మార్కెట్లోకి వస్తాయో.. రావో చెప్పకుండా, ఎందుకు ఈ అధ్యయనాలు అనేది మద్యం ప్రియులను వెంటాడుతున్న ప్రశ్న.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలులో ఉన్న మద్యం విధానాలను అధ్యయనం చేసేందుకు ఇప్పటికే అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. దీనికి తోడు కేబినెట్‌ సబ్‌కమిటీని కూడా వేసి అధ్యయనం చేసేందుకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వీరి నివేదికలు వచ్చిన తర్వాత అన్ని కోణాల్లో పరిశీలించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. మరో నెల రోజుల పాటు మద్యం ప్రియులకు ఈ ఊరింపులు ఆశనిపాతమేనని చెప్పొచ్చు.
నూతన మద్యం విధానం అమలు కాగానే అక్రమ మద్యం, గంజాయి, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మధ్యం ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం అధికారులను ఆదేశిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీని వల్ల అల్పాదాయ వర్గాల వారికీ అందుబాటు ధరలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందని మంత్రి వర్గం భావించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మద్యంపై దృష్టి సారించింది. తమకు అనుగుణంగా నాసిరకం పాలసీని గత జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీని ద్వారా వారి జేబులు నింపుకునే విధంగా అమలు చేసిందని విమర్శలు గుప్పించింది. ప్రతిపక్షంలోను జగన్‌ మద్యం పాలసీపైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్‌ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నారని, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని తీవ్ర స్థాయిలోనే ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేత పత్రం విడుదల చేశారు.
బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మద్యం పాలసీపైన చర్చించారు. తక్కువ ఖర్చులతో మద్యం తయారు చేసి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చేలా పాలసీని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తయారీకి 16 శాతం ఖర్చు అయితే 84 శాతం వైఎస్‌ఆర్‌సీపీ నేతల జేబుల్లోకి ఆదాయం వెళ్లేలా మద్యం విక్రయాలు చేపట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అందుకే డిజిటల్‌ పేమెంట్ల విధానం మద్యం విక్రయాల్లో పెట్టలేదని ఆరోపించారు. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకుండా దోచుకున్నారని మండిపడ్డారు. 2014–19లో మాదిరిగా ఈ సారి కూడా అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ రూపకల్పన కోసం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, కేరళతో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాలలోని మద్యం విధానాలను కూడా అధ్యయనం అనంతరం ప్రత్యేక పాలసీని రూపొందించి అక్టోబర్‌ 1 నుంచి కొత్త మద్యం పాలసీని ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి తీసుకొని రానున్నారు.
Tags:    

Similar News