గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పీఎంకే పొత్తుకు కారణం అదేనా?

‘అన్భుమణి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడు అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చారు’ - సీబీఐ;

Update: 2025-06-02 11:49 GMT
Click the Play button to listen to article

పట్టాలి మక్కల్ కట్చి (PMK) వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి (Anbumani) మధ్య విబేధాలు తలెత్తాయని పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల రామదాస్ (Ramadoss) ప్రెస్‌మీట్ పెట్టి అన్భుమణిని రాజ్యసభకు పంపడమే తాను చేసిన పెద్ద తప్పు అని బహిరంగంగానే కొడుకు మీద కోపాన్ని బయటపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్బుమణి, అతని భార్య సౌమియా ఒత్తిడితోనే బీజేపీ(BJP)తో జత కట్టాల్సి వచ్చిందని చెప్పడం.. ఇప్పుడు తమిళనాట కలకలం రేపుతోంది. సీబీఐ కేసు నుంచి బయటపడేందుకే అన్బుమణి గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు..

మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అన్బుమణికి రాజ్యసభ సీటు ఇప్పించి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు రామదాసు. 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి అనుమతి ఇచ్చి అవినీతికి పాల్పడ్డాడని అన్భుమణిపై ఆరోపణలున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని రోహిల్‌ఖండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (RMCH), మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఇండెక్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (IMCHRC)లో MBBS కోర్సులో ప్రవేశానికి అక్రమంగా అనుమతులు మంజూరు చేసి అవినీతికి పాల్పడ్డాడని CBI కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, నేరపూరిత కుట్ర తదితర కేసుల కింద కేసు కట్టారు. తగినంత అధ్యాపక సిబ్బంది, క్లినికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా అప్పటి డిప్యూటీ సెక్రటరీ KVS రావు కలిసి మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. మొదట లక్నోలో ఈ కేసు ఫైలయ్యింది. అయితే 2014లో అన్బుమణి అభ్యర్థన మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు కేసును బదిలీ చేశారు. అన్బుమణి, KVS రావు, RMCH చైర్మన్ KK అగర్వాల్, IMCHRC చైర్మన్ SS భడోరియాతో పాటు మరికొందరి పేర్లను CBI తన చార్జిషీట్‌లో పేర్కొంది. 2015లో ప్రత్యేక CBI కోర్టు అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే తనమీద నమోదయిన అభియోగాలను సవాల్ చేస్తూ చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రతిజ్ఞ చేశారు అన్భుమణి.

ఈ కేసుతో ప్రమేయం ఉన్న మాజీ సీనియర్ సీబీఐ అధికారితో ఫెడరల్ మాట్లాడింది. "ఇది అన్బుమణితో పాటు మరికొంత మందిపై నమోదయిన కేసు. ఢిల్లీ హైకోర్టు స్టే ఎత్తివేస్తే మళ్లీ దర్యాప్తు మొదలుపెడుతుంది. సీబీఐ కేసు కారణంగానే అన్భుమణి బీజేపీతో పొత్తుకు మొగ్గు చూపించి ఉండవచ్చని సీనియర్ జర్నలిస్ట్ టి రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు.

ఒక్కచోట కూడా గెలవని పీఎంకే..

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల పొత్తు విషయంలో తండ్రీ‌కొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ వర్గాల మాట. రామదాస్ కోరికకు విరుద్ధంగా అన్బుమణి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో జతకట్టారు. పోటీచేసిన 10 స్థానాల్లో ఎక్కడా కూడా పీఎంకే గెలవలేకపోయింది. ధర్మపురిలో పోటీచేసిన అన్బుమణి భార్య సౌమియా కూడా ఓడిపోయారు.

ఇక 2026 అసెంబ్లీ ఎన్నికలలో రామదాస్ AIADMKతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే అన్బుమణి BJP నేతృత్వంలోని NDAతో కొనసాగాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇద్దరి మధ్య దూరానికి ఆజ్యం పోసిందని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎంకేలో చీలిక ఏర్పడితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఇతర పార్టీలు పెద్దగా విలువ ఇవ్వవని రామకృష్ణన్ అభిప్రాయం.

Tags:    

Similar News