‘తెలంగాణ విద్యార్థులకు జర్మనీ నేర్పించండి’
జర్మనీ కాన్సుల్ జనరల్ ను కోరిన రేవంత్ రెడ్డి
‘తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించాలి’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మనీ బృందంతో అన్నారు.తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించాలని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మనీ కాన్సుల్ జనరల్ ను కోరారు. హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహాయ , సహకారాలు అందించాలని జర్మనీ కాన్సుల్ జనరల్ను రేవంత్ రెడ్డి కోరారు.
పెట్టుబడులకు సురక్షితం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం ఇవ్వాళ సమావేశం అయ్యింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసీసీ) ను నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. పెట్టుబడులకు హైదరాబాద్ సురక్షితమైనదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మనీ బృందంతో అన్నారు. జిసీసీ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ కంపెనీ జీసీసీ ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు సీఎంకు జర్మనీ బృందం వివరించింది.
హైదరాబాద్ ఇన్నోవేషన్ హబ్
హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. పెట్టుబడుల కోసం తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని జర్మన్ బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.