‘పొలిటికల్ కెరీర్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు’
మంత్రి సతీష్ జార్కిహోళికి సీఎం సిద్ధరామయ్య మెంటార్గా వ్యవహరిస్తారని ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పునకు సంకేతమా?
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర(Yathindra) చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పును సూచిస్తున్నాయి. ‘‘పొలిటికల్ కెరీర్లో మా నాన్న గారు చివరి దశలో ఉన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ సమర్థవంతంగా నడిపించగల మరో వ్యక్తి జార్కిహోళి(Jarkiholi). ఆయనే ఆ బాధ్యతలు చేపడతారని కోరుకుంటున్నాను" అని యతీంద్ర అన్నారు. బెళగావి జిల్లాలోని రాయ్బాగ్ తాలూకా కప్పలగుడ్డి గ్రామంలో కనకదాసు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
డీకే వర్గీయుల్లో ఆందోళన..
యతీంద్ర వ్యాఖ్యలు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మే 2023లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ పోటీపడ్డారు. ఇద్దరితోనూ మాట్లాడిన అధిష్టానం.. సిద్ధరామయ్యను సీఎంగా, శివకుమార్ను డిప్యూటీ సీఎంగా నియమించింది. రొటేషన్ పద్ధతిలో వారి మధ్య ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. తొలుత రెండున్నరేళ్లు సీఎంగా సిద్ధరామయ్య, ఆ తర్వాత కాలం శివకుమార్ బాధ్యతలు చేపడతారని పార్టీ నేతలు భావించారు. కాని యతీంద్ర వ్యాఖ్యలు డీకే వర్గీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తన తండ్రి స్థానాన్ని మంత్రి జార్కిహోళి (సిద్ధరామయ్య వర్గం) భర్తీ చేస్తాడన్న సంకేతాలను పంపాడు. యతీంద్ర వ్యాఖ్యలపై అధిష్టానం, పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తుందో చూడాలి.