నన్ను ఇబ్బంది పెట్టారు.. వడ్డీతో సహా చెల్లిస్తానంటోన్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.

Update: 2024-08-27 16:44 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ కేసుల్లో మంగళవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మద్యం పాలసీ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందజేసింది.

దాదాపు మూడు గంటలు విడుదల ప్రాసెస్...

ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇచ్చిన షూరిటీ బాండ్లను ట్రయల్ కోర్టు స్వీకరించింది. దాదాపు మూడు గంటల పైనే కవిత విడుదల ప్రాసెస్ జరిగింది. అనంతరం ఆమెని అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఏడాది మార్చ్ 15 న అరెస్టైన కవిత... 165 రోజుల తర్వాత లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పై బయటకి వచ్చారు. అప్పటికే తీహార్ జైలు వద్దకు చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తా -కవిత 

"నేను కేసీఆర్ బిడ్డను. నేను మొండి దాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపారు. ఐదు నెలలు కుటుంబానికి దూరంగా జైల్లో ఉన్నాను. 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నన్ను అనవసరంగా జైలుకు పంపి జగమొండి దాన్ని చేశారు. నాకు సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. మొత్తం దేశానికి తెలుసు రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలు పంపించారు. ఇంకా గట్టిగా పోరాడుతాను గట్టిగా పని చేస్తాను వెనక్కి పోయే ప్రసక్తి లేదు. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. ఈ కష్ట సమయంలో నాకు నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని తెలిపారు కవిత.

 

ఏడ్చేసిన కవిత...

కవిత జైలు నుంచి బయటకి రాగానే ఎదురుగా ఉన్న తన కొడుకుని హగ్ చేసుకుని ఏడ్చేశారు. తల్లీకొడుకులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారందరినీ కదిలించేశాయి. అనంతరం కవిత తన భర్తని, అన్న కేటీఆర్ ని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. కన్నీరు కారుస్తూనే మీడియాతో మాట్లాడారు.

 

ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీసులో సెలెబ్రేషన్స్...

జైలు నుంచి విడుదల అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన కవిత... అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆమెకి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. అనంతరం కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతో కవిత సమావేశమయ్యారు. 

Tags:    

Similar News