మెస్సీపై రేవంత్ గెలుపు
ఆరంభం నుంచే రేవంత్ రెడ్డి జట్టు దూకుడు ప్రదర్శించింది.
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో రేవంత్ జట్టు ఘన విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్లో రేవంత్ గోల్ చేశారు. ఈ మ్యాచ్ను చూడటం కోసం వచ్చిన అభిమానులతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కిక్కిరిసిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఒకే మైదానంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. సరిగ్గా రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్లో సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా, అపర్ణ టీంలో లియోనెల్ మెస్సీ బరిలోకి దిగాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే రేవంత్ రెడ్డి జట్టు దూకుడు ప్రదర్శించింది. వరుసగా రెండు గోల్స్ సాధించి ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. ఆ తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి వచ్చి గోల్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొద్దిసేపటి తర్వాత లియోనెల్ మెస్సీ కూడా గ్రౌండ్లోకి దిగడంతో స్టేడియం ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది.
దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి నంబర్ వన్ జెర్సీతో సింగరేణి జట్టు తరఫున సందడి చేయగా, మెస్సీ మాత్రం జెర్సీ లేకుండానే అపర్ణ టీం తరఫున తన సహజ శైలిలో ఆడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ ఒక్క షాట్తో బంతిని ప్రేక్షకుల గ్యాలరీ టాప్ ఎండ్కు పంపి అభిమానులను మరింత ఉత్సాహపరిచాడు.
ఆ తర్వాత మైదానంలో ఉన్న ఆటగాళ్లతో కలిసి మెస్సీ సరదాగా గడిపాడు. ఫోటోలు దిగుతూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పండగ వాతావరణాన్ని తలపించింది. మెస్సీ–రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన అభిమానులు ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటామంటూ ఆనందం వ్యక్తం చేశారు.