మహేష్ కుమార్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై మహేష్ కుమార్.. తీవ్ర ఆరోపణలు చేయడంతోనే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.;

Update: 2025-06-17 16:39 GMT

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై మహేష్ కుమార్.. తీవ్ర ఆరోపణలు చేయడంతోనే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మంగళవారం మహేష్ కుమార్ గౌడ్.. విచారణలో పాల్గొన్నారు. సాక్షిగా ఆయన అధికారుల ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం ఆయన బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కీలక ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వారు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. అలా చేసే ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని అన్నారు.

‘‘అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించాం. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను పూర్తిగా గాలికొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు కూడా చూస్తూ ఊరుకోబోరు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘స్థానిక ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశంతోనే మరోసారి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఈ లొట్టపీసు కేసుతో ఒరిగేదేమీ లేదు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని నడిపించే సత్తా, సామర్థ్యం లేకపోవడంతోనే ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ కుట్రలతో కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చేసే ఇలాంటి దుర్మార్గపూరిత వ్యాఖ్యల పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి నాయకులను కోర్టులకు ఈడుస్తాం. ఇప్పటికైనా పరిపాలనపై దృష్టి పెట్టి, అటెన్షన్ డ్రైవరేషన్ డ్రామాలను పక్కన ప్రతిపక్ష నాయకుల పైన ప్రాపగాండా చేయడం మానాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజలకు మంచి చేసే అంశాల పైన దృష్టి సారించాలని హితవు పలికారు.

మహేష్ ఏమన్నారంటే..

‘‘అధికారం ఉంది కదా అని ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి మరీ రాజకీయ లబ్ది పొందాలని భావించారు. అందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. అందుకు మీరు ముమ్మాటికీ శిక్షార్హులు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం ఇలాంటి పనికి పాల్పడకూడదంటే ఇప్పుడు వీరిని శిక్షించాల్సిందే. విచారణను సజావుగా జరిపి.. రాజకీయ నాయకులైనా, అధికారులైనా ఎవరైనా సరే బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘చట్టానికి వ్యతిరేకంగా ఎంతోమంది ఫోన్లను ట్యాప్ చేశారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను టార్గెట్ చేశారు. సిట్ దర్యాప్తులో దాదాపు 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు బాధితుల జాబితాలో ఉన్నాయని తెలిసింది. కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్‌తోపాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటికి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే, నాడు ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకులకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు.. దానిని కాలరాశారు. పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పెట్టారు. నక్సలైట్లకు సానుభూతిపరులుగా ఉన్నారని మమ్మల్ని ట్యాప్‌ చేయడం సిగ్గుచేటు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News