రేపటి నుంచి రైతు భరోసా

మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం;

Update: 2025-06-16 12:30 GMT

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు.మంగళవారం నుంచి రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు అనుకున్నట్లు కాకుండా ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశంకాకుండా ఫార్మల్ గా మంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.స్ధానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా వుందన్న సీఎం , ఇప్పటి వరకూ ప్రభుత్వం అందజేస్తున్న పథకాల అమలుపై మంత్రులతో సమీక్షించారు.ఇటీవల అన్ని జిల్లాలకూ ఇంఛార్జ్ మంత్రులను నియమించిన నేపధ్యంలో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు ,జిల్లా ఇంఛార్జ్ మంత్రులకు మధ్య సమన్వయం వుండాలని అందరూ కలుపుకొని పోవాలని రేవంత్ సూచించారు.

స్థానిక ఎన్నికలపై సీఎం సమీక్ష

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించారు.జూలై రెండవ వారంలో స్థానిక ఎన్నికలకు పోవాలని నిర్ణయించారు.స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఏమిచేయాలన్న దానిపైనా ఈ సమావేశంలో చర్చించారు. ముందుగా పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు పరచాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది.అందుకు తగ్గట్టుగా మంత్రులు , పార్టీ నేతలను సన్నద్ధం చేయాలని రేవంత్ సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ,ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా ,ఇందిరమ్మ ఇళ్ల అంశాలను పూర్తి స్థాయిలో ప్రజలలోకి తీసుకెళ్లాలని , విపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వవద్దని సీఎం సూచించారు.అదేసమయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలన్నారు.స్తానిక సంస్థల ఎన్నికలలో పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు రావాలని అందుకుతగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు రూ .125 కోట్లు మంజూరు చేస్తూ మంత్రుల సమావేశం తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ లో కేటాయించిన 500 కోట్ల రూపాయలలో భాగంగా ఈ నిధులు మంజూరు చేసింది. అలాగే వేములవాడ అభివృద్దికి 25 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

Tags:    

Similar News