కాళేశ్వరం కమిషన్‌కు కూడబలుక్కునే సమాధానాలు..

ఒకే జవాబులు చెప్పిన ఈటల, హరీష్ రావు. రేపు కేసీఆర్‌ది కూడా అదే మార్గమా..;

Update: 2025-06-10 08:23 GMT

కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఈటల రాజేందర్, హరీష్ రావు కూడబలుక్కుని సమాధానాలు చెప్పారా? కమిషన్ విచారణలో ఏం చెప్పాలి అని వాళ్లు ముందుగానే డిసైడ్ అయ్యారా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం తెలంగాణ అంతటా వినిపిస్తున్నాయి. అందుకు కారణం కమిషన్ విచారణలో వీరిచ్చిన సమాధానాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో వస్తున్న ఆరోపణల్లో తమదేం లేదని చేతులెత్తేశారు. అంతా అధికారులదేనని తేల్చి చెప్పారు. ప్రతి నిర్ణయం కూడా కేబినెట్ కలిసి తీసుకుందన్నారు. ఈటల ఏదో నామమాత్రంగా హరీష్, కేసీఆర్ అంతా చూసుకున్నారని అనడమే తప్పా.. మిగిలినదంతా అధికారుల చేతుల్లోనే ఉందని అన్నారు. సోమవారం విచారణకు హాజరైన హరీష్ మాటలు కూడా దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. బ్యారేజీల నిర్మాణం, డిజైన్‌ల మార్పు వంటి టెక్నికల్ అంశాలు తమకు తెలియవని, ఇంజినీర్లు, అధికారులదే నిర్ణయమని అన్నారు.

అధికారులే బలిపశువులవుతున్నారా..!

కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయా? లేదా? జరిగితే ఎంత మేరా జరిగాయి? ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ఇలాంటి విషయాలను తేల్చడానికి పీసీ ఘోష్ కమిషన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనేక మందిని విచారించింది. ఇంకా కీలకమైన వ్యక్తులను విచారిస్తోంది. వారిలో మాజీ మంత్రులు ఈటల, హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఈటల, హరీష్ రావుల విచారణ ముగిసింది. కాగా కమిషన్ ప్రశ్నలకు వీరిద్దరూ చెప్పిన సమాధానాలు చూస్తుంటే.. కాళేశ్వరం ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారులే బలిపశువులు అవుతున్నారన్న భావన కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అధికారంలో ఉన్నంత వరకు కాళేశ్వరం క్రెడిట్ అంతా మాదే.. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ను నిర్మించింది మేమే అని చెప్పిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు సైతం.. కమిషన్ ముందుకు వెళ్లగానే నిర్మాణం, ప్రాజెక్ట్ ప్లేస్ ఛేంజ్ ఇలాంటి టెక్నికల్ విషయాల్లో అధికారులదే తుది నిర్ణయం అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఈటల సమాధానం కూడా ఇదే. అధికారులదే అంతా.. వాళ్లే నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వీరి సమాధానాలు చూస్తుంటే.. అధికారులు అంధకారంలోకి వెల్లడం తథ్యమనిపిస్తోందనేది విశ్లేషకుల మాట.

కేసీఆర్ సమాధానం కూడా ఇదే కానుందా..!

ఈ క్రమంలోనే బుధవారం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పుడు ఈక్వేషన్స్‌ను చూస్తే కేసీఆర్ నుంచి కూడా అధికారులదే తుది నిర్ణయం అన్నటువంటి సమాధానం వచ్చేలా కనిపిస్తోంది. సోమవారం విచారణ పూర్తయిన వెంటనే హరీష్ రావు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో విచారణలో జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పి ఉంటారని, దాని ప్రకారమే ఇప్పుడు కేసీఆర్ కూడా తన సమాధానాలను రెడీ చేసుకుంటారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కేసీఆర్ ఏదో నివేదిక రెడీ చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుండటంతో.. అందులో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.

ఈటల, హరీష్ నిజంగానే కూడబలుక్కున్నారా..?

ఇదిలా ఉంటే కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల వెళ్లడానికి మునుపే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమిషన్‌కు ఏం చెప్పాలి అన్న విషయంపై ఈటల, హరీష్ రావు ఒక ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ భేటీ వివరాలన్నీ బయటపెడతామని, ఇది తమకు సన్నిహిత వర్గాల నుంచి అందిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పుడు కమిషన్‌కు ఈటల, హరీష్ చెప్పిన సమాధానాలు చూస్తుంటే.. మహేష్ కుమార్ వ్యాఖ్యలు వాస్తవాలే అనిపిస్తున్నాయి. ఈటల మాటల్లో, హరీష్ రావు సమాధానాల్లో చాలా పోలికలు ఉండటం ఇందుకు మెయిన్ రీజన్.

కమిషన్ ప్లాన్ ఏంటో..?

మరి ఇలా కూడబలుక్కుంటారన్న అనుమానం కమిషన్‌కు రాలేదా? అంటే ఎందుకు రాదు.. తప్పుకుండా వచ్చే ఉంటుంది. మరి ఇలాంటి వాటిని అధిగమించి నిజాలు రాబట్టడానికి విచారణలో కమిషన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో. ఇది వరకు అధికారులు, ఇప్పుడు ఈటల, హరీష్ రావుల వాంగ్మూలాల ఆధారంగానే కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ విచారణ కోసం కమిషన్ ఎలాంటి ప్లాన్స్ సిద్ధం చేస్తుంది అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. మరి కేసీఆర్ ఎలాటి సమాధానాలిస్తారో చూడాలి.

Tags:    

Similar News