ప్రణీత్ రావు మొబైల్ ఫోన్ వల్లే ప్రభాకరరావు దొరికాడా ?

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ బాస్, ఏ1 నిందితుడు టీ ప్రభాకరరావును సిట్ అధికారులు నాలుగురోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే;

Update: 2025-06-15 12:16 GMT
Telephone Tapping A1 accused T Prabhakar Rao

వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇదే నిజమని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విచారణలో బయటపడినట్లు సమాచారం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ బాస్, ఏ1 నిందితుడు టీ ప్రభాకరరావును సిట్ అధికారులు నాలుగురోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. మొదటి మూడురోజుల విషయాన్ని వదిలేస్తే నాలుగోరోజు విచారణలో మాత్రం కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. అవేమిటంటే తాము ఎవరిఫోన్లయితే ట్యాపింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయనో లేకపోతే మావోయిస్టుల మద్దతుదారులనో అదీకాకపోతే మావోయిస్టులకు ఆర్ధికసాయం చేస్తున్నారనో ఇంకో అడుగువేసి మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే అనుమానాలున్నాయనే ముద్రవేసినట్లు తెలిసింది.

నిజానికి ఎవరి ఫోన్ అయినా ట్యాప్(Telephone Tapping) చేసేందుకు ఇంటెలిజెన్స్ బాస్ కు ఆధారాలు ఉండవు. ఆ అధికారం హోంశాఖ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీకి మాత్రమే ఉంటుంది. ఇంటెలిజెన్స్ బాస్ నుండి వచ్చిన ట్యాపింగ్ రిక్వెస్టులను రివ్యూ కమిటి చెక్ చేసిన తర్వాత హోం సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి టెలిఫోన్ ప్రొవైడర్లకు లేఖ వెళుతుంది. ప్రొవైడర్ల నుండి అనుమతులు వచ్చిన తర్వాతే సదరు ఫోన్ నెంబర్లను ఇంటెలిజెన్స్ అధికారులు ట్యాప్ చేయగలరు. ఇదంతా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన తంతు. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏమిటంటే రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాప్ చేయమని టీ ప్రభాకరరావుకు జాబితా అందగానే వెంటనే ట్యాప్ చేసేశారు. రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారమిచ్చి ప్రొవైడర్లకు లేఖలు రాయించారు. అలాగే ప్రొవైడర్లకు వెళ్ళిన లేఖల్లో తాము సొంతంగా మరికొన్ని నెంబర్లను కలిపేశారు. తాము ట్యాప్ చేయాలని అనుకున్న ఫోన్ నెంబర్ల వినియోగదారులపై ఏ1 నిందితుడు రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం అందించినట్లు తాజాగా బయటపడింది.

బీఆర్ఎస్(BRS) రాజకీయ ప్రత్యర్ధులందరిపైనా మావోయిస్టు(Maoists) ముద్రవేసి ట్యాపింగుకు అనుమతి తీసుకున్నట్లు ఇపుడు బయటపడింది. అలాగే మరో విషయం ఏమిటంటే కొన్ని నెంబర్లకు రివ్యూ కమిటి అనుమతి తీసుకుని ఆ నెంబర్లకు తమిష్టమొచ్చిన నెంబర్లను కలిపేసి ప్రొవైడర్ల నుండి అనుమతి తీసుకుని కొన్ని, తీసుకోక మరికొన్ని ఫోన్లను ప్రభాకరరావు టీమ్ అత్యంతాధునిక సాఫ్ట్ వేర్లతో ట్యాపింగ్ చేసింది. ఈ విధంగా మొత్తం 4200 ఫోన్లను నిందితుడి బృందం ట్యాపింగ్ చేసింది. బీఆర్ఎస్ ప్రత్యర్ధులతో పాటు సెలబ్రిటీలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు, కొందరు జడ్జీలతో పాటు వాళ్ళ కుటుంబసభ్యులు చివరకు బీఆర్ఎస్ లోని అనుమానిత నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రభుత్వానికి ముప్పుగా అనుమానించిన వాళ్ళ ఫోన్లనుట్యాపింగ్ చేయించటం ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేదే. కాని టార్గెట్ చేసి వేలాది ఫోన్లు ట్యాపింగ్ చేయించటం మాత్రం కేసీఆర్(KCR) హయాంలోనే జరిగింది. ట్యాపింగ్ బాధితుల్లో ముందున్నది రేవంత్ రెడ్డే(Revanth).

రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్ చేయటానికే ప్రభాకరరావు తనిష్టప్రకారం స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎస్ఓటీ)ని ఏర్పాటు చేశాడు. ఆ టీమ్ అప్పటి డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో పనిచేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఎస్ఓటీ అన్నదే లేకపోయినా ప్రత్యేకంగా ట్యాపింగ్ తో రాజకీయ ప్రత్యర్ధులను వేధించటం కోసమే ఏ1 నిందితుడు ఎస్ఓటీని ఏర్పాటుచేశాడు. రాజకీయప్రత్యర్ధుల కోసమే ఎస్ఓటీని ఏర్పాటుచేసినట్లు సిట్ విచారణలో నిందితుడు అంగీకరించినట్లు సమాచారం.

డిసెంబర్ 4 రాత్రి ఏమి జరిగింది ?

2023 డిసెంబర్ 4వ తేదీ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అదేరోజు రాత్రి ఎస్ఓటీ ఆఫీసుకు చేరుకున్న ప్రణీత్ రావు ముందుగా సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. తర్వాత ఆఫీసు కాంపౌండ్ లో ట్యాప్ చేసిన ఫోన్ల వివరాలున్న 1200 పేజీల రికార్డులను కాల్చేశాడు. తర్వాత కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్ లను బయటకు తీసి అన్నింటినీ కట్టర్లతో పగలగొట్టేశాడు. హార్డ్ డిస్క్ లతో పాటు మరికొన్ని పెన్ డ్రైవులు, చిప్స్, ట్యాపింగ్ పరికరాలను ముక్కలు ముక్కలు చేసేశాడు. కంప్యూటర్లలోని సమాచారం మొత్తం కనీసం ఆనవాళ్ళు కూడా దొరక్కుండా ఎరేజ్ చేసేశాడు. ముక్కలుచేసిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్ళి మూసీనదిలో కలిపేశాడు. అక్కడితో అక్రమ ట్యాపింగ్ ఆధారాలను అన్నింటినీ మాయం చేసేశామని ఎస్ఓటీ టీమ్ హ్యాపీగా ఫీలైంది. ప్రణీత్ రావుతో పాటు ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించిన ఇతర పోలీసు అధికారులు తిరుపతయ్య, రాధాకిషన్ రావు, భుజంగరావు కూడా తమ పరిధిలోని అక్రమట్యాపింగ్ ఆనవాళ్ళను చెరిపేసేందుకు ఇదే పద్దతిని అనుసరించారు.

మొబైల్ వల్లే నిందితుడు దొరికాడా ?

ఇల్లంతా అలికిన ఈగ తన పేరు మరచిపోయిందనే సామెత సరిగ్గా ప్రణీత్ రావుకు సరిపోతుంది. ఎస్ఓటీ ఆఫీసులో అక్రమ ట్యాపింగ్ ఆనవాళ్ళని విజయవంతంగా తుడిచేసిన ప్రణీత్ రావు ఒక విషయాన్ని మరచిపోయాడు. అదేమిటంటే తన మొబైల్ ఫోన్ను. మూసినదిలో హార్డ్ డిస్క్ ముక్కలను కలిపేయటం, కొంత మెటీరియల్ ను కాల్చేయటాన్ని స్ధానికులు ఎవరో చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని హార్డ్ డిస్క్ ముక్కలను, మరికొంత మెటీరియల్ ను స్వాధీనం చేసుకోవటంతోనే టెలిఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగుచూసింది. దొరికిన మెటీరియల్ తో పాటు స్ధానికులు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం పోలీసు దర్యాప్తుచేశారు. దొరికిన ఆధారాలు, స్ధానికులు చెప్పిన ఆనవాళ్ళ ఆధారంగా విచారించిన అధికారులకు మూసీనది దగ్గరకు వెళ్ళింది ఎవరో అర్ధమైపోయింది. తర్వాత పోలీసుఅధికారులు సదరు అనుమానిత అధికారిపై నిఘాపెట్టారు. తమ అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అధికారి ప్రణీత్ రావుగా నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ప్రణీత్ ను పిలిపించారు. యధాలాపంగా మాట్లాడుతున్నట్లు మాట్లాడుతునే ప్రణీత్ మొబైల్ ఫోన్ను తీసుకున్నారు. రెండు, మూడురోజులు మాట్లాడిన తర్వాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు.

స్వాధీనంచేసుకున్న మొబైల్ ఫోన్ లోని సమాచారాన్ని చూసినపుడు ప్రభాకరరావుకు ప్రణీత్ రావుకు మధ్య ట్యాపింగ్ కు సంబంధించిన కొన్ని వాట్సప్ మెసేజీలు బయటపడ్డాయి. ఆ మెసేజీల్లో ట్యాపింగ్ చేయాల్సిన వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళు వాడుతున్న మొబైల్ నెంబర్లు కూడా కనిపించాయి. అలాగే ఎరేజ్ చేసిన వాట్సప్ సమాచారాన్ని నిపుణులతో రిట్రైవ్ చేయించారు. తర్వాత ఎరేజ్ చేసిన సమాచారాన్ని తిరిగి తెప్పించేందుకు ల్యాబ్ కు పంపారు. మొబైల్ లో దొరికిన సమాచారం ప్రకారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇతరులతో జరిపిన సంభాషణలు, కాల్ రికార్డులు దొరికాయి. బయట సమాచారాన్ని పక్కాగా చెరిపేసిన ప్రణీత్ రావు తన మొబైల్ ఫోన్లోని సమాచారం చెరపటం మరచిపోయాడు. దాంతోనే ప్రణీత్-ప్రభాకరరావు మధ్య ట్యాపింగ్ విషయంలో జరిగిన ఆదేశాలు, సంభాషణలు బయటపడ్డాయి.

తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చిన రిపోర్టు ప్రకారం ట్యాప్ చేసిన 4200 ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్చేసిన 1200 పేజీల సమాచారం అంతా బయటపడింది. దీని ఆధారంగానే సిట్ అధికారులు ప్రణీత్ రావును గట్టిగా విచారించినపుడు ఏ1 నిందితుడు రివ్యూ కమిటీకి ఇచ్చిన తప్పుడు సమాచారం బయటకు వచ్చింది. కొన్ని నెంబర్లకు అనుమతి తీసుకుని ప్రొవైడర్లకు లేఖలు ఇచ్చేటపుడు మరికొన్ని నెంబర్లను ఎలా జతచేసింది, రివ్యూ కమిటికి తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటపుడు టార్గెట్లందరికీ మావోయిస్టుల ముద్రను వేసిన విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పేశాడు. ప్రణీత్ రావు బయటపెట్టిన సమాచారం ఆధారంగానే ఇపుడు సిట్ అధికారులు ప్రభాకరరావును గంటలకొద్ది ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్ రావు ద్వారా బయటపడిన సమాచారాన్ని ఏ1 నిందితుడికి చూపించి ప్రశ్నించినపుడు ముందు బుకాయించినా తర్వాత కొన్ని విషయాలను అంగీకరించినట్లు సమాచారం.

క్షేత్రస్ధాయిలోని సమాచారం ప్రకారం ట్యాపింగ్ లో తనపాత్రను ప్రభాకరరావు అంగీకరించే రోజు ఎంతో దూరంలో లేదని అనిపిస్తోంది. అయితే ప్రభాకరరావుకు ఆదేశాలు, వ్యక్తుల పేర్లు, మొబైల్ నెంబర్లిచ్చి ట్యాపింగ్ చేయించింది ఎవరనే విషయమే తేలాలి. ఈ విషయం తెలుసుకోవటానికే సిట్ అధికారులు గడచిన 15 మాసాలుగా నానా అవస్తలు పడుతున్నారు. ఇందుకోసమే అమెరికాకు పారిపోయిన ప్రభాకరరావును రప్పించింది. ట్యాపింగ్ చేయమని తనకు ఆదేశాలు ఇచ్చింది ఎవరనే విషయాన్ని ప్రభాకరరావు వెల్లడిస్తారా ? లేకపోతే తనంతట తానే 4200 ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు తనమీదే వేసుకుంటారా అన్నది చూడాలి.

Tags:    

Similar News