చివరి చూపుకూ కుటుంబసభ్యులు నోచుకోలేరా ?
తమవాళ్ళని ఒకసారి చూడనివ్వమని కుటుంబసభ్యులు ప్రాదేయపడినా పోలీసు అధికారులు అనుమతించలేదు;
ఎన్ కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల చివరి చూపుకు కూడా కుటుంబసభ్యులు నోచుకోలేరా ? వినటానికి బాధగనే ఉన్నా జరుగుతున్నది ఇదే. బుధవారం రంపచోడవరం అడవుల్లో గ్రేహౌండ్స్ ఎన్ కౌంటర్లో మావోయిస్టు(Maoists encounter) అగ్రనేత, ఏవోబీ ప్రత్యేక జోనల్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటి సభ్యురాలు అరుణ, ఛత్తీస్ ఘడ్ సుకుమాజిల్లా కుంట ఏరియా కమిటి సభ్యురాలు అంజు చనిపోయిన విషయం తెలిసిందే. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్ కౌంటర్ జరిగి మూడురోజులు అయిపోయింది. అదేరోజు సాయంత్రం తర్వాత మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం రంపచోడవరం ఆసుపత్రికి తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం పోస్టుమార్టమ్ కూడా పూర్తయిపోయింది. అయినా సరే డెడ్ బాడీస్ ను కుటుంబసభ్యులకు ఇప్పటివరకు అందించలేదు.
గాజర్ల రవి ఎన్ కౌంటర్లో చనిపోయిన విషయం వార్తల్లో తెలుసుకుని వెంటనే భూపాలపల్లి జిల్లా, సుకుమా ప్రాంతం నుండి కుటుంబసభ్యులు రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తీసుకొచ్చినపుడు తమవాళ్ళని ఒకసారి చూడనివ్వమని కుటుంబసభ్యులు ప్రాదేయపడినా పోలీసు అధికారులు అనుమతించలేదు. పోస్టుమార్టమ్ అయిన తర్వాతే డెడ్ బాడీస్ ను ఇస్తామని చెప్పారు. పోస్టుమార్టమ్ అయిన తర్వాత ఎలాగూ మృతదేహాలను తీసుకుంటామని ఈలోగా ఒకసారి చూసుకుంటామని కుటుంబసభ్యులు ఎంతగా బతిమలాడినా పోలీసులు అంగీకరించలేదు. చివరకు కుటుంబసభ్యులను పోస్టుమార్టమ్ జరిపించే వార్డు దగ్గరకు కూడా వెళ్ళనీయలేదు. అప్పుడు కుటుంబసభ్యులు ఏమీ మాట్లాడలేదు.
గురువారం సాయంత్రం పోస్టుమార్టమ్ అయిపోయిన తర్వాత మృతదేహాలను తమకు అప్పగించాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు అందితేనే డెబ్ బాడీస్ అప్పగిస్తామని లోకల్ పోలీసులు తెగేసిచెప్పరు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్ధితిలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు స్ధానికంగా ఉండే ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్ళి భోరముంటున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం కావటంతో ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి ఇష్టపడటంలేదు. గాజర్ల రవి మృతదేహాన్ని అప్పగిస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో అంత్యక్రియలు జరిపించేందుకు కుటుంబసభ్యులు అన్నీ సిద్ధం చేసుకున్నారు.
అయితే పోలీసులు మాత్రం మృతదేహాలను కుటుంబసభ్యులకు ఇచ్చే విషయమై ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. విచిత్రం ఏమిటంటే గాజర్ల రవి సోదరుడు గాజర్ల అశోక్ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయ్యుండీ ఉపయోగంలేకపోయింది. అలాగే అరుణ తండ్రి లక్ష్మణరావు, ఝాన్సీ సోదరి, అమరుల బంధువుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ తదితరులంతా ఆసుపత్రి దగ్గరే పడికాపులు కాస్తున్నారు. డెడ్ బాడీస్ విషయంలో పోలీసులు జాప్యంచేయటం చూస్తుంటే అసలు కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మావోయిస్టు కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి నంబాలకేశవరావు విషయంలో ఏమి జరిగిందో అందరూ చూసిందే. కేశవరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలని ఛత్తీస్ ఘడ్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులే అంత్యక్రియలు నిర్వహించేశారు.
పోలీసులే అంత్యక్రియలు ఎందుకు చేశారు ?
మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల అంత్యక్రియలను పోలీసులే ఎందుకు నిర్వహించారు ? ఎందుకంటే కుటుంబసభ్యులకు బాడీని అప్పగిస్తే కోర్టులో కేసువేస్తారని పోలీసులు అనుమానించినట్లు అప్పట్లో నంబాల కుటుంబసభ్యులు బాహాటంగానే ఆరోపించారు. నంబాలను సజీవంగా పట్టుకుని చిత్రహింసలు పెట్టి తర్వాత దగ్గర నుండి పోలీసులు కాల్చి చంపేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. డెడ్ బాడీస్ ను కుటుంబసభ్యులకు అప్పగిస్తే ఒంటిపైన గాయాలను గమనిస్తారు. ఒంటిపైన గాయాలను ఫొటోలు, వీడియో తీసి దాన్ని పెట్టుకుని కోర్టులో పోలీసులపైన కేసులు వేస్తారేమో అన్న అనుమానంతోనే తమకు డెడ్ బాడీని అప్పగించటంలేదని హక్కుల సంఘం నేతలు పోలీసులపై విరుచుకుపడ్డారు.
మృతదేహాన్ని కడసారి చూడనీయరా ?
తమ కూతురు శవాన్ని చివరిసారిగా చూసుకునేందుకు కూడా లేదా అని అరుణ తండ్రి లక్ష్మణరావు పోలీసులను నిలదీశారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి అంతిమసంస్కారాలు నిర్వహించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే పోలీసులు తమకూతురు డెబ్ బాడీని చూసేందుకు కూడా తమను అనుమతించటంలేదని భోరుమన్నారు. మార్చురీలోకి వెళ్ళి ఒక్కసారి కూతురును చూసివస్తామని బ్రతిమలాడినా అనుమతించటంలేదని వాపోయారు. తమ కూతురు మొహాన్ని చూడటానికి కూడా పోలీసులు అనుమతించకపోవటం చాలా అన్యాయమని తండ్రి ఆవేధనను ఎవరూ తీర్చలేకపోతున్నారు.
అరుణ సోదరి ఝాన్సీ మాట్లాడుతు మృతదేహాలు తమకు చూపిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయన్న భయంతోనే పోలీసులు తమను అనుమతించటంలేదని మండిపడ్డారు. శరీరంపై గాయాలను తాము గుర్తుపడతామని, న్యాయపోరాటం చేస్తామన్న భయంతోనే తమను మృతదేహాలను చూడటానికి కూడా పోలీసులు అనుమతించటంలేదని ఝాన్సీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భూటకపు ఎన్ కౌంటరే: గడ్డం
గాజర్ల రవి, అరుణ, అంజులను పోలీసులు భూటకపు ఎన్ కౌంటర్లో చంపేసినట్లు తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. వీళ్ళని ఎక్కడో పట్టుకుని చంపేసి ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు పోలీసులు అబద్ధాలు చెబుతున్నట్లు మండిపడ్డారు. తమకు అందిన సమాచారం ప్రకారం గణేష్, అరుణ, అంజులను సజీవంగా పట్టుకుని తర్వాత కాల్చిచంపేసినట్లు గడ్డం తెలిపారు.