‘డైరెక్ట్‌గా పోరాడే దమ్ము లేకనే ఫోన్ ట్యాపింగ్’

ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఎవరు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు.;

Update: 2025-06-24 09:15 GMT

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. నేరుగా యుద్ధం చేసే సత్తా, దమ్ము లేని వాడు, చేతకాని వాడు మాత్రమే ఇలాంటి దారుణాలకు, దుర్మార్గాలకు ఒడిగడతారంటూ ఈట రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన మంగళవారం సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. సాక్షిగా విచారణకు హాజరైన ఆయన తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అనంతరం బయటకు వచ్చి.. ఈ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఎవరు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఎందరో నేతలు, అధికారులు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని నిరూపించే సాక్ష్యాలు ఉన్నాయి అధికారుల దగ్గర. ఉగ్రవాదులు, తీవ్రవాదులు వంటి సంఘవిద్రోహ శక్తులపై వాడే ఫోన్ ట్యాపింగ్ పద్దతిని తమపై వాడటం అత్యంత దుర్మార్గమన్నారు.

క్షణక్షణం నిఘా ఉంచారు..

‘‘మా ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా మేము ఎక్కడికి వెళ్తున్నాం. ఎవరిని కలుస్తున్నాం. ఎవరితో మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం. ఇలా అన్ని విషయాలపై నిఘాబెట్టారు. మేము ఎవరితో మాట్లాడినా.. రాత్రికి వాళ్ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు. 2018 నుంచే కొనసాగింది. ఆనాటికీ నేను ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాను. అయినా సరే వదిలిపెట్టలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగితే.. పొద్దునా సాయంత్రం శ్రమించా. ఆ సమయంలో కూడా నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా.. ఎవరితో ఉన్నా వంటి అన్ని విషయాలు తెలుసుకున్నారు. నాతో మాట్లాడిన వారిని బెదిరించి, డబ్బులు, పదవుల ఆశ చూపి నన్ను ఓడించారు. దీనిని నిరూపించే వందల ఆధారాలను ఇవాళ అధికారులు నా ముందు ఉంచారు’’ అని ఈటల చెప్పారు.

2023లో కూడా అదే సీన్ రిపీట్..

‘‘2023లో జరిగిన ఎన్నికల్లో, హుజూరాబాద్‌లో వచ్చిన ఉపఎన్నిక సమయంలో కూడా ఇదే మళ్ళీ రిపీట్ అయింది. డైరెక్ట్‌గా ఎదుర్కోనే సత్తా, దమ్ము లేనోల్లే ఇలా చేస్తారు. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా.. కమిషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని మాట్లాడుతున్న రేవంత్‌కు ఇదే నా సవాల్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కనుక లోపాయికార ఒప్పందాలు చేసుకోకపోతే, లాలూచీ పడకపోతే.. ఎందుకు తూతూ మంత్రం కమిషన్లు వేస్తున్నారు. వాటి రిపోర్ట్‌లు ఎందుకు రావట్లేదు. బాధ్యులపై ఎందుకు చర్చలు తీసుకోవట్లేదు. ఎంక్వయిరీలు అన్నీ కూడా ఎందుకు నత్తనడక జరుగుతున్నాయి? అని సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

ప్రభాకర్ రావు నియామకం ఒక అక్రమం

‘‘ప్రభాకర్ రావు.. డైరెక్ట్ ఐపీఎస్ కాదు. ప్రమోషన్స్ ద్వారా ఐపీఎస్‌ అయ్యారు. ఎస్ఐబీ అనేది బాధ్యతాయుతమైన సంస్థ. రిటైర్ట్ అయిన తర్వాత కూడా ప్రభాకర్ రావును కొనసాగించడం ఎంత బాధ్యతారాహిత్యమో, నిబంధనలకు విరుద్దమో అర్థమైపోతోంది. నిజంగానే ఆయన గొప్ప అధికారి అయితే.. ఒక సలహాదారుడిగా, ఓఎస్‌డీగా పెట్టుకోవచ్చు కదా. కానీ ఒక బాధ్యతగల స్థానంలో పెట్టకూడదు. ప్రభాకర్ రావును అధిక పోస్ట్‌లో పెట్టడమే కాకుండా.. కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎం చేతిలో ఉండే ఇంటెలిజెన్స్‌‌కు, ఎస్ఐబీకి కూడా ప్రభాకర్ రావు బాధ్యతలు నిర్వహించారు. ఇదెంత అక్రమమో అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోని ప్రతి నిందితుడు కూడా పైఅధికారుల ఆదేశాల మేరకే చేశామని చెప్తున్నారు’’ అని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికయినా ఈ వ్యవహారంలో దర్యాప్తును వేగవంతం చేయాలని, వీటిపై సమగ్ర విచారణ జరగాలని ఈటల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News