రాజీవ్ యువవివకాసానికి దరాఖాస్తు చేయడమెలా?
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రభుత్వ ప్రవేశపెట్టింది.;
తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో నిరుద్యోగం ఒకటి. ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అందించినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే అన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడం మంచిదని భావించింది. అందుకోసం యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రభుత్వ ప్రవేశపెట్టింది. యువత తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఆకాంక్షతోనే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈ పథకానికి శ్రీకారం చుట్టామని, ఈ పథకం కోసం రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ఈ పథకానికి ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
ఈ పథకం కింద అర్హులైన యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సబ్సిడీలతో పాటు రూ.3 లక్షల వరకు రాయితీ రుణాలను అందించనుంది ప్రభుత్వం. ఈ పథకం యువ వ్యవస్థాపకులకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చి వారి ఆర్థికాభివృద్ధితో పాటు నిరుద్యోగాన్ని తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
అద్భుతమైన ఆదరణ..
అయితే ఈ పథకానికి యువత నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటి పరిశీలన పనులను ఏప్రిల్ 14 తర్వాత నుంచి అధికారులు ప్రారంభించనున్నారు. ఈ పథకంపై యువతలో మంచి అభిప్రాయాలు ఉన్నాయి. యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే.. బంగారు భవితకు బాట వేసుకోవచ్చని చెప్తున్నారు. ‘‘ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల్లో ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ది బెస్ట్. యువత కరెక్ట్గా వాడుకోవాలే కానీ.. ఈ పథకం వారికి సువర్ణావకాశాలను ఇస్తుంది. చాలా మంది యువత సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని అనుకుంటారు.. కానీ వారి ముందు ఉండే అతిపెద్ద ఛాలెంజ్.. డబ్బులు. ఐడియా ఉన్నా దానిని ఆచరణలో పెట్టడానికి డబ్బు ఉండదు. ఆ ఛాలెంజ్ను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. కష్టం అనేలా కాకుండా రుణాలు ఇచ్చి వ్యాపారాలు పెట్టాలనుకునే వారిని ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రమేష్ అనే యువకుడు తన అభిప్రాయం చెప్పారు.
ఇంతటి స్థాయిలో యువత ఆదరణ అందుకుంటున్న ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పథకం లక్ష్యం ఇదే..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువతను స్వయం ఉపాధి, వ్యవస్థాపకతలో ప్రోత్సహించడానికి ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తారు. అర్హులైన యువతకు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి సబ్సిడీలతో పాటు రూ.3లక్షల వరకు 60-80 శాతం రాయితీ రుణాలను అందిస్తుంది.
అర్హతలు
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల వార్షికాదాయం, పట్టణ(మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉన్నవారు అర్హులు.
- దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్కార్డు లేకుంటే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి.
- వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారు వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు వయసు 21 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత (ఐదేళ్ల సమయంలో స్వయం ఉపాధి పథకాలకు)
మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్(ESS)కు దరఖాస్తు చేసుకుంటున్న వారికి, మహిళలకు 25శాతం, వికలాంగులకు 5శాతం, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గకరణ ఉద్యమ కుటుంబాలకు, నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డు, రేషన్కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా సంబంధిత యూనిట్లైతే), పట్టాదారు పాసుపుస్తకం (వ్యవసాయ అనుబంధ పథకాలకు), సదెరమ్ సర్టిఫికెట్ (వికలాంగ కేటగిరీ), పాస్పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, అత్యంత పేదలైతే వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ (మండల స్థాయి కమిటీ).
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
- దరఖాస్తుదారులు https://tgobmmsnew.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Click Here To Download APPLICATION FORM పై క్లిక్ చేసి ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను పూర్తి చేయాలి.
- దరఖాస్తు ఫామ్ తో పాటు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆహార భద్రత కార్డు.
- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ ను పై పత్రాలు జత చేసి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ లోని ప్రజాపాలన సేవా కేంద్రంలో ఇవ్వాలి.
- మున్సిపాలిటిలో అయితే మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది.
వచ్చిన దరఖాస్తులను మండలస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషన్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేకాధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డీఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
కమిటీ అధికారులు వీళ్లే..
ఈ కమిటీకి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్గా డీఆర్డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్, ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమాధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయక సంచాలకులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు.
ఎంపిక తర్వాత..
- నిర్దేశించిన తేదీల్లో మండల, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అర్హులను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను జిల్లా ఇన్చార్జి మంత్రికి కలెక్టర్ సమర్పించాలి.
- ఎంపికైన లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన సామగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారుకు కాకుండా సదరు సంస్థ, ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుకు ఇస్తారు.
- స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలి.
- యూనిట్లు గ్రౌడింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకుని తనిఖీలు చేపట్టాలి.
ఇటీవలే దరఖాస్తుల గడువు ముగియగా... ఈ గడువును ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. ఆ తర్వాత మండలస్థాయి కమిటీలు అర్హుల ఎంపికలు పూర్తిచేసి జిల్లాస్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి. జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి యూనిట్లను మంజూరు చేస్తాయి. జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారికి 7 రోజుల నుంచి 15 రోజుల వరకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహిస్తారు. అనంతరం యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ గ్రౌండ్ చేసిన తరువాత 6 నెలల నుంచి ఏడాది వరకు శిక్షణ అందిస్తారు. స్కీమ్ అమలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే జిల్లా కమిటీ పరిశీలించి... పరిష్కారం దిశగా నిర్ణయం తీసుకుంటుంది. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణను కూడా సిద్ధం చేసింది.