బీజేపీని ఇరకాటంలో పడేసిన రాజాసింగ్
రాజాసింగ్ వ్యవహారం నచ్చకపోవటంతో ఒకదశలో పార్టీ నేతల్లో చాలామంది మాట్లాడటం కూడా మానేశారు.;
కొందరు నేతలు పార్టీ మీద ఆధారపడ్డారో లేకపోతే పార్టీయే వాళ్ళమీద ఆధారపడిందో అర్ధంకాదు. తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పాపులరైన ఎంఎల్ఏ రాజాసింగ్(MLA Raja Singh) వ్యవహారమే దీనికి తాజా ఉదాహరణ. ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గం నుండి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్న రాజాసింగ్ వ్యవహారం పార్టీకి పెద్దతలనొప్పిగా మారింది. కొంతకాలంగా పార్టీనేతలతో ఎంఎల్ఏకి పడటంలేదు. అందుకనే పార్టీతో కూడా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. రాజాసింగ్ వ్యవహారం నచ్చకపోవటంతో ఒకదశలో పార్టీ నేతల్లో చాలామంది మాట్లాడటం కూడా మానేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో కేసు నమోదై జైలులో ఉన్నపుడు ఎంఎల్ఏను చాలామంది నేతలు ఒక్కసారి కూడా పరామర్శించలేదు. అప్పటి నుండి పార్టీకి రాజాసింగ్ కు గ్యాప్ బాగా పెరిగిపోయింది.
2023 ఎన్నికల్లో ఎంఎల్ఏకి టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న సందేహాలు పెరిగిపోయిన నేపధ్యంలో చివరి నిముషంలో టికెట్ ఇచ్చారు. ఎందుకంటే గోషామహల్(Gosha Mahal) లో రాజాసింగ్ తప్ప పోటీచేసేంత గట్టి నేతలు లేరు. గోషామహల్ అంటేనే ఓల్డ్ సిటీలోనిది. ఓల్డ్ సిటీ అంటేనే మజ్లస్ పార్టీకి కంచుకోటని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓల్డ్ సిటీలో మజ్లిస్ ను తట్టుకుని రాజాసింగ్ వరుసగా మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారంటేనే ఆయన కెపాసిటి ఏమిటో అర్ధమవుతోంది. అనేక కారణాల వల్ల పార్టీపై రాజాసింగ్ నోటికొచ్చినట్లు మాట్లాడేయటం సంచలనంగా మారుతోంది. తాజాగా కల్వకుంట్ల కవితకు మద్దతుగా ఎంఎల్ఏ మాట్లాడటం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ ను బీజేపీ(BJP)లో విలీనంచేసే కుట్ర జరిగిందన్న కవిత వ్యాఖ్యలు నిజమే అని రాజాసింగ్ మద్దతుగా మాట్లాడారు.
ఒకవైపు విలీనం చర్చలూ లేవు, కుట్రలూ జరగలేదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందనరావు(BJP MP Raghunandan Rao) చెబుతుంటే మరోవైపు విలీనం చర్చలు నిజమే అని రాజాసింగ్ బల్లగుద్ది చెప్పటం పార్టీని ఇరకాటంలో పడేసింది. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా నేతలు బీఆర్ఎస్ లో కలిసిపోతారని ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో కలిసిపోతారన్నారు. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీలు కలిస్తే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ నేతలు ఎక్కడినుండి ఎవరు పోటీచేయాలో కూడా బీఆర్ఎస్సే డిసైడ్ చేస్తుందన్న రాజాసింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంతకముందు జరిగింది కూడా ఇదే అన్నారు. దీనివల్లే తమ పార్టీ నష్టపోతోందని కూడా చెప్పారు.
రాష్ట్రంలో పార్టీ ఎందుకు అధికారంలోకి రాలేదో బీజేపీ నేతలు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. తమ నేతలు ఇతరపార్టీలతో కుమ్మక్కవ్వటం వల్లే చాలాసార్లు నష్టపోయిందన్న రాజాసింగ్ కామెంట్లు పార్టీలో హాట్ టాపిక్ అయిపోయాయి. పార్టీ సస్పెండ్ చేస్తుందన్న భయంతోనే చాలామంది సీనియర్ నేతలు ఈవిషయాలు మాట్లాడేందుకు వెనకాడుతున్నట్లు రాజాసింగ్ చెప్పటం సంచలనంగా మారాయి. మరిపుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, కవిత ఆరోపణలకు మద్దతుగా మాట్లాడటంపై పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రాజాసింగ్ మీద గట్టి యాక్షన్ తీసుకునేంత సీన్ పార్టీ నాయకత్వానికి లేదన్న విషయం గతంలోనే అర్ధమైంది. నాయకత్వం మరిపుడు ఏమిచేస్తుందో చూడాలి.