ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టుకు సిట్..!
రిలీఫ్ ఉండటంతో ఆయన ఇష్టారీతిన సమాధానాలు ఇస్తున్నారని సిట్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.;
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణపై సిట్ అధికారులు అత్యున్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారని సమాచారం. తాజాగా గురువారం ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు నాలుగోసారి విచారిస్తున్నారు. కానీ విచారణలో పురోగతి ఏమీ లభించలేదు. అధికారులు అడుగుతున్న ఏ ప్రశ్నకు కూడా ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పడం లేదు. దాటవేత ధోరణి కనబరుస్తున్నారు. ఇతర నిందితుల వాంగ్మూలాలు, తాము సేకరించిన సాక్ష్యాలను, నిందితులను ముందుంచి విచారించినా లాభం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్పై సిట్ ఫోకస్ పెట్టింది. అతని రిలీఫ్ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభాకర్ రావు రిలీఫ్ రద్దు చేసి ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది. అప్పుడే ఆయన నుంచి సమాధానాలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పుడు రిలీఫ్ ఉండటంతో ఆయన ఇష్టారీతిన సమాధానాలు ఇస్తున్నారని సిట్ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తాము అడిగిన ప్రశ్నలు, అందుకు ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలను కూడా సిట్ తన పిటిషన్లో పేర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పటికే ప్రభాకర్ రావు కొందరు సీనియర్ల పేర్లను విచారణలో వెల్లడించారు. దీంతో రివ్యూ కమిటీ సభ్యులు డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ను కూడా విచారించి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసింది.
ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ ఇదే..
ఫోన్ టాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తీసుకుంది. ఇన్ని రోజులు అమెరికాలో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆయనకు మూడు రోజుల్లో పాస్పోర్ట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో పాటుగానే ప్రభాకర్ రావు పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించకూడదుని, ప్రభాకర్ రావు.. ఫోన్ టాపింగ్ కేసుకు పూర్తిగా సహకరించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది.