తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ పులిజాడలు
వార్దా నదిలో పులి సంచరిస్తున్నట్టు వెల్లడించిన అటవీ శాఖ
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని వార్దా నదిలో పులి అడుగులను స్థానికులు గుర్తించారు. వార్దా నది గోదావరి నదికి ఉపనది. ఈ నది మహరాష్ట్ర వార్దా జిల్లాలో ప్రవహిస్తోంది. తెలంగాణ తాటిపల్లి గ్రామ సమీపంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా థరూర్ గ్రామ సమీపంలోని వార్ద నదిలో పులి అడుగులను స్థానికులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. మహారాష్ట్ర అటవీ అధికారులు పులి అడుగులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. పులి అడుగుల గుర్తుల వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో స్పందించిన తెలంగాణ రాష్ట్ర కౌటాల అటవీ సెక్షస్ అధికారులు తులసీరాం, శ్రీదేవిలు వార్దా నది పరిసరాలను పరిశీలించారు.
తెలంగాణ వైపు పులి అడుగులు లేనప్పటికీ ప్రజలను అప్రమత్తం చేశారు. సరిహద్దులో పులి సంచారం ఉంది అంటే ఎప్పుడైనా తెలంగాణ అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉండే గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకనే అప్రమత్తంగా ఉండాలని తాటిపల్లి గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి చాటింపు వేయించారు.రైతుల చేన్లలోకి వెళ్లినప్పుడు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్ళాలని సూచించారు. పులి అనవాళ్లు కనిపించినట్లయితే వెంటనే తమకు వెంటనే సమాచారం అందించాలని అధికారులు కోరారు.
మహరాష్ట్రలోని దరూర్ ప్రాంతంలోపెద్దపులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని వార్ధానది ఒడ్డున పులిని చూసినట్లు కౌటాల మండలంలోని పత్తిరైతులు చెబుతున్నారు. అయితే ఎప్పుడైనా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పులి సంచారం నేపథ్యంలో కౌటాల మండలం తాటిపల్లి వద్ద కౌటాల ఎఫ్ ఎస్ ఓ తులసీదాస్ సందర్శించి పులి అడుగులను నిర్ధారించారు. రాత్రి పూట ఒంటరిగా తిరగకూడదని, గుంపులుగా తిరిగితే పులి దాడి నుంచి తప్పించుకోవచ్చని అటవీ అధికారులు చాటింపు వేస్తున్నారు.