ఇండిగో విమానాల రద్దుతో ప్రత్యేక రైళ్లకు గిరాకీ
37 రైళ్లకు 116 బోగీలు జోడించాలని రైల్వేశాఖ నిర్ణయం
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రత్యేక రైళ్లకు గిరాకీ పెరిగింది. దీంతో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్కతా, హైదరాబాద్-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు ప్రకటన చేశారు. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో సర్వీసులు కొనసాగుతున్నాయి.
శంషాబాద్ లో 155 సర్వీసులు రద్దు
విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 9 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. వీటిలో చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ వెళ్లేవి ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి 11 సర్వీసులు రాకపోకలు కొనసాగిన్నాయి.హైదరాబాద్ నుంచి 155 ఇండిగో విమానసర్వీసులు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి.
ఇండిగో రద్దుపై కేంద్రమంత్రుల స్పందన
ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోవడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. పూర్తిస్థాయి పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇండిగో విమానాల రద్దుపై కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామి ఇచ్చారు. విమానాల రద్దు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బాధిత ప్రయాణికులకు రిఫండ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
ఐదోరోజులుగా నిలిచిపోయిన ఇండిగో
వరుసగా ఐదు రోజులపాటు ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో హైదరాబాద్ కు రావాల్సిన 26 విమానాలు, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 43 విమానాలు రద్దయ్యాయి. యధాస్థితి కొనసాగడానికి వారం, పది రోజులు పట్టచ్చని అధికారులు తెలిపారు. మొత్తంమీద శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుండి 155 సర్వీసులు రద్దయ్యాయి. ఎప్పటినుండి ఈ సర్వీసులు మొదలవుతాయో కూడా ఎవరూ చెప్పలేకున్నారు.