నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆర్టీసీ లో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

Update: 2024-06-03 14:45 GMT

నిరుద్యోగులకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆర్టీసీ లో కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న సజ్జనార్ మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎన్నటికీ మరువలేనిదన్నారు. 'బస్ కా పయ్యా నహీ ఛలేగా' నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని సిబ్బందిని కొనియాడారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ను టీజీఎస్ఆర్టీసీ సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు. గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

Tags:    

Similar News