బీఆర్ఎస్‌లో పెరుగుతున్న బుధవారం టెన్షన్..!

బుధవారం విచారణలో కమిషన్ ఏమడగొచ్చు? అన్న ప్రశ్న బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.;

Update: 2025-06-10 10:54 GMT

జూన్ 11వ తేదీ బీఆర్ఎస్‌కు చాలా కీలకం కానుంది. ఆ రోజు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందా అని ప్రతి బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పెరిగిపోతోంది. క్షేత్రస్థాయి నేతల్లో కూడా బుధవారం గురించే ఆలోచన. పార్టీ అంతటా దీని గురించి చేర్చలు కూడా. ఇంతకీ అంత టెన్షన్ దేనికని అనుకుంటున్నారా.. దానికి కారణం కేసీఆర్. ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తున్న రెండు కేసుల్లో రేపు విచారణ జరగనుంది. కాళేశ్వరం అవకతవకల అంశంలో పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ స్వయంగా హాజరుకానున్నారు. మరొకటి కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ1 ప్రభాకర రావు విచారణ కూడా బుధవారం కొనసాగనుంది. దీంతో అసలు బుధవారం ఏం జరగనుంది? అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తోంది. బుధవారం ఏం జరుగుతుందని అంతా చర్చిస్తున్నారు.

క్వశ్చన్ పేపర్ లీకయినా టెన్షన్ టెన్షన్..!

కాళేశ్వరం కమిషన్ విచారణ విషయంలో అసలు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడగనుంది అనే ప్రశ్నాపత్రం దాదాపు కేసీఆర్‌కు లీకయింది. హరీష్ రావు తన విచారణ పూర్తయిన వెంటనే కేసీఆర్‌తో ఐదు గంటలకుపైగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నను, దానికి తానిచ్చిన సమాధానాన్ని హరీష్ రావు సవివరంగా చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కమిషన్‌ను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న అంశాలపై కేసీఆర్ పక్కా క్లారిటీతో ఉన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ అసలు బుధవారం విచారణ కమిషన్ ఏమడగొచ్చు? అన్న ప్రశ్న బీఆర్ఎస్ శ్రేణుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు విచారణకు హాజరైన 120 మంది కూడా కాళేశ్వరం విషయంలో అన్ని నిర్ణయాలు కూడా పాలకులు తీసుకున్నవేనని, తమ పాత్ర ఏం లేదని పేర్కొంటూ అఫిడవిట్‌లు కూడా అందించారు. వీటి ఆధారంగా కూడా కమిషన్ విచారణను ముందుకు సాగించనుంది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారులు, అప్పటి నేతలతో కేసీఆర్ వరుస భేటీలు కూడా అయ్యారు. ఆయన ఒక నివేదిక సిద్ధం చేస్తున్నారని, దానిని విచారణ సమయంలో కమిషన్‌కు అందించనున్నారని సమాచారం. అసలు ఆ నివేదికలో ఏముంది? దానిని స్వీకరించిన కమిషన్.. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు సంధించవచ్చు? వంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఉత్కంఠగా ప్రభాకర్ రావు విచారణ..!

ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రమంతా పెద్ద లొల్లిగా మారిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వ్యాక్ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. దాదాపు 15 నెలల తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలతో ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరయ్యారు. సోమవారం సిట్ అతనిని విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ జరిగింది. అనంతరం బుధవారం మరోసారి విచారించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు విచారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూడొచ్చు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో తాను ఒక బాధితుడిని అని చెప్తున్న ప్రభాకర్ రావు.. ఎలాంటి విషయాలు వెల్లడించే అవకాశం ఉంది అన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

కమిషన్ స్టైల్ మారుస్తుందా..

కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ తర్వాత బుధవారం మాజీ సీఎంను విచారించే విషయంపై కాళేశ్వరం కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనను విచారించడం కోసం ప్రత్యేక ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలసై అధికారులు కసరత్తులు చేస్తున్నారని, హరీష్ రావు, ఈటల వాంగ్మూలం, అధికారులు ఇచ్చిన అఫిడవిట్‌ల ఆధారంగా ప్రశ్నలు వేయాలని డిసైడ్ అయింది. మొత్తానికి కేసీఆర్ విచారణకు నయా ప్లాన్ రెడీ చేయాలని కమిషన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కమిషన్ బాటలోనే సిట్..!

ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇప్పటికే ఒకరోజు 8 గంటల పాటు విచారించారు. కానీ ఈ విచారణలో ఆశించిన సమాధానాలు రాలేదని సమాచారం. దీంతో బుధవారం తమ విచారణ స్టైల్ మార్చాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావును అడిగే ప్రశ్నల్లో స్వల్ప మార్పులు చేయాలని, ఎలాగైనా కొత్త విషయాలు తెలుసుకోవాలని సిట్ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే బుధవారం.. ప్రభాకర్ రావును ప్రశ్నించడం కోసం ప్రత్యేక ప్రశ్నలను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి బీఆర్ఎస్ టెన్షన్ పడుతున్నట్లు బుధవారం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.

Tags:    

Similar News