ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దందా..ప్రభుత్వనియంత్రణ ఎప్పుడు?

చదుకునే పరిస్థితులకన్నా ,చదువు కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి.;

Update: 2025-06-13 09:54 GMT

విద్య నేర్పడం ఇప్పుడు సేవకాదు పక్కా వ్యాపారంగా తయారైంది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలవుతున్నాయి.విద్యాకమిషన్ సిఫార్సులు కాగితాలకే పరిమితమవుతున్నాయి...కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైనా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం కనిపించడం లేదు.

కొండంత ఫీజుల భారం

ప్రస్తుతం చదుకునే పరిస్థితులకన్నా ,చదువు కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి.ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఏకంగా 50శాతం దాకా ఫీజులు పెంపు జరిగితే , చిన్న స్థాయి ప్రైవేటు స్కూళ్లలోనూ తక్కువలో తక్కువగా 25 శాతం పెంచేశారు.సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్ బుక్స్ , యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఎల్ కే జీ నుంచే ఫీజుల భారంతో ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు పిల్లలను చదివించాలంటేనే వణికిపోతున్నారు.మధ్యస్థాయి పాఠశాలల్లో పిల్లలను చదివించాలన్నా.. అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళన.ఎంత కష్ఠమైనా ప్రైవేటు స్కూళ్లలో చేర్చడానికే అందరూ మొగ్గుచూపడంతో ప్రభుత్వ పాఠశాలలు అట్టడుగు వర్గాల పిల్లలకే పరిమితమవుతున్నాయి.

పాఠశాల ఫీజులకూ ఫైనాన్షియర్లు ..

ప్రతి ఏడాదీ ఎడాపెడా ఫీజులను పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ,ఫీజులు కట్టలేని తల్లిదండ్రులకూ బంపర్ ఆఫర్ అంటూ కొత్త దందా ప్రారంభించాయి. హైదరాబాద్ లోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఫీజులు కట్టలేని తల్లిదండ్రులకు ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసి ఫీజుల కోసం అప్పులు ఇప్పిస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల నుంచీ ఆ అప్పును వసూలు చేసుకునే బాధ్యతను ఫైనాన్షియర్లు చూసుకుంటున్నారు. అంటే తల్లిదండ్రుల పాట్లు అప్పుల వాళ్లకు వదిలేసి , తమ ఫీజులను చక్కగా రాబట్టుకొంటున్నారు. తిరిగి నిర్ణీత సమయంలో తల్లిదండ్రులు అప్పు చెల్లించకుంటే వడ్డీ మోత తప్పదు. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా కార్పొరేట్ విద్య సంస్థలతో ఈ పద్ధతిలో సిండికేట్ అవుతున్నాయి.

Full View

ప్రభుత్వం చట్టం తేవడమే సరియైన మార్గం

ప్రభుత్వ విద్య వ్యవస్థ బాగుపడాలంటే రాష్ట ప్రభుత్వం సమగ్ర చట్టం తేవాల్సిందేనని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ,తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించడంతో పాటు , ప్రభుత్వ పాఠశాలలలో మంచి విద్య దొరుకుతుందన్న నమ్మకం అందరిలో కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరల్ తెలంగాణతో తెలిపారు.పిల్లలు తగ్గుతున్నారన్న కారణంతో పాఠశాలలను మూసివేయడం మార్గం కాదన్నారు.ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ విషయంలోనూ ప్రభుత్వం సరియైన మార్గదర్శికాలు తీసుకురావాలన్నారు. ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తప్పకుండా రావాలని తెలిపారు. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకులు కల్లేపల్లి సుందరయ్య ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ విద్యావ్యాపారులు కొందరు ప్రభుత్వాలలో భాగం అవుతున్నారని , రాజకీయ నేతలు పలువురు ప్రైవేటు విద్యా సంస్థలను నడుపుతున్నారని అందుకే ప్రభుత్వం సరియైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.విద్య, వైద్యం వ్యాపారం కాకూడదన్నదే తన అభిప్రాయమంటూ , తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయని, అదే తరహాలో పటిష్ట చట్టం తెలంగాణ లోనూ రావాలన్నారు.డివైఎఫ్ వై నేత రమేశ్ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ పాఠశాలలు చతికల పడుతున్నాయని తెలిపారు.విద్యా వ్యాపారంలో వున్న కార్పొరేట్ల వత్తిడికి ప్రభుత్వాలు తలొగ్గుతున్నాయన్నారు.

మంత్రుల కమిటీ చేసిందేమిటి?

ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది.రాష్ట్ర విద్యాకమిషన్ ద్వారా సమగ్ర నివేదికను తెప్పించుకుంది. విధివిధానాలు ,చట్టం తేవడానికి వున్న అవకాశాలపై సమీక్ష జరపడానికి ,స్కూల్ యాజమాన్యాలు , వివిధ వర్గాల ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించడానికి ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు.మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వం లోని కమిటీ ఇప్పటికి రెండు సార్లు సమావేశం అయింది.అయినా ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విద్య కమిషన్ చేసిన పలు సిఫార్సులపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎల్ కే జీ , యూకేజీ తరగతులను ఈ సంవత్సవం నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది .ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అందుబాటులో లేని కారణంగానే ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్నారన్న కొన్ని సూచనల మేరకు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.అయితే అంగన్ వాడీలను ఇందుకోసం ఎటాచ్ చేయాలన్న నిర్ణయాన్ని మాత్రం విద్యావేత్తలు తప్పుపడుతున్నారు.ప్రీ ప్రైమరీ నిర్వహించడానికీ తగిన శిక్షణ పొందిన వారు వుండాలని సూచిస్తున్నారు.

ప్రైవేటు ఫీజల మోత తగ్గించే దిశగా ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు.

గతంలోనూ అమలుకు నోచుకోని తిరుపతిరావు కమిటీ సిఫార్సులు

తెలంగాణ వ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.ప్రతి ఏడాది ప్రైవేటు స్కూల్లు ఫీజులను పెంచుతుండటంతో సమస్య పరిష్కారానికి ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని గత ప్రభుత్వం నియమించింది. కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది.పాఠశాలలో మౌలిక సదుపాయాల ఆధారంగా ఏటా పదిశాతం లోపు ఫీజులు పెంచుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించాలని సూచించింది. పదిశాతం పైగా ఫీజు పెంచే పాఠశాలలు అన్ని ఆర్ధిక లావాదేవీలు బ్యాంక్ ద్వారా జరిపేలా నిబంధన విధించాలని , ప్రభుత్వానికి లెక్కలు చెప్పేలా చట్టం తేవాలని కమిటీ సూచించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని ఇంచుమించు 11 వేల ప్రైవేటు స్కూళ్లను చట్టం పరిధిలోకి తీసుకు రావాలని భావిస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు.

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బయటకు ప్రకటనలు ఇస్తూ ,బడిబాట అంటూ స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులతో విద్య సంవత్సరం ప్రారంభం ముందు ఎంత హడావుడి చేసినా ఫలితం లేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుందన్న నమ్మకం ప్రజలలో కల్పించిన నాడు ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారతాయి. అధికారులు,ప్రజాప్రతినిధులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేరిస్తే సమాజంలో ప్రభుత్వ విద్య పై వున్న దురభిప్రాయం పోయి కొత్త ఉరవడి కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News