నిర్మలా సీతారామన్కు స్టాలిన్ లేఖ..
వ్యవసాయ రుణాలకు బంగారాన్ని తాకట్టుపెట్టడాన్ని నిషేధించడాన్ని పున:పరిశీలించాలని కోరిన తమిళనాడు ముఖ్యమంత్రి;
రుణాల మంజూరులో ఆర్బీఐ కొత్త నిబంధనలను పున: పరిశీలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. వ్యవసాయ రుణాలకు బంగారాన్ని తాకట్టుపెట్టి రుణం పొందడంపై ఆర్బీఐ (Reserve Bank of India) కొత్త నిబంధనలు విధించింది. ఇకపై బంగారంపై రైతులకు రుణాలు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘తమిళనాడు(Tamil Nadu), దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలకు ప్రాథమిక వనరు బంగారు రుణాలు. కొత్త నిబంధనలు గ్రామీణ రుణ వ్యవస్థకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, పాడి, కోళ్ల పెంపకం, మత్స్య సంపద రంగాల మీద ఆధారపడ్డ వారికి," అని ముఖ్యమంత్రి తన నోట్లో పేర్కొన్నారు.
తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు గత వారం బంగారు రుణాలపై కొత్తగా విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆర్బీఐని కోరిన తర్వాత ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రికి లేఖ రాశారు.
ఆర్బీఐ మరికొన్ని కొత్త నిబంధనలు..
1. తాకట్టు పెట్టే బంగారంపై గరిష్టంగా 75% లోన్ ఇస్తారు. కొవిడ్ సమయంలో దీన్ని 80 శాతానికి పెంచారు. మళ్లీ ఇప్పుడు 5 శాతం తగ్గించారు.
2. నగలు కొన్న సమయంలో పొందిన రశీదు ఉండాలి. లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. 22 క్యారెట్ల బంగారు నగలు, ఆభరణాలు, ప్రభుత్వ బ్యాంకులు అమ్మిన బంగారు నాణేలకు మాత్రమే లోన్ ఇస్తారు.
4. స్వచ్ఛత ఆధారంగా వెండి నగలకు కూడా లోన్ మంజూరు చేస్తారు.
5. ఒక వ్యక్తికి కిలోకి మించి తాకట్టు పెట్టకూడదు.
6. లోన్ను 12 నెలల లోపు తిరిగి చెల్లించాలి.
7. లోన్ డబ్బు చెల్లించిన 7 పనిదినాల్లోగా బ్యాంకర్ నగలను లోన్ టేకర్కు తిరిగి ఇవ్వాలి. ఆలస్యమైతే రోజుకు రూ.5,000 చొప్పున బ్యాంకర్ రుణగ్రహీతకు చెల్లించాలి.
బ్యాంకర్కు లోన్ టేకర్కు మధ్య పారదర్శకత కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. క్లయింట్ లేకుండానే బంగారానికి విలువ కట్టడం.. లోన్ డబ్బులు చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేసే విషయంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఈ నిబంధనలు చెక్ పెడతాయి.